త్వరపడండి.. టైమ్ లేదు: సోనియాతో కమల్..?

ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పటికే పార్టీ పేరును, విధి విధానాలను ప్రకటించిన కమల్ హాసన్.. బీజేపీయేతర పక్షాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు తెర వెనుక పావులు కదుపుతున్నట్లుగా.. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేసేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లుగా తెలుస్తోంది.. మక్కల్ నీధి మయ్యమ్ అనే పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. నిన్న పార్టీ రిజిస్ట్రేషన్ గురించి ఢిల్లీ వెళ్లి అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కమల్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా..? లేక కాంగ్రెస్‌కు మద్ధతు తెలుపుతారా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ షాక్ నుంచి తెరుకోకముందే ఇవాళ ఉదయం యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీని కలవడం మరింత దుమారాన్ని రేపింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నేతలమైన మేమంతా ఒకే కుటుంబానికి చెందిన వారమని.. రాహుల్, సోనియాలో భేటీని ఒకే రకంగా చూడాలని.. తాము కేవలం తమిళనాడులోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి మాత్రమే చర్చించామని కమల్ అన్నారు.

అయితే కాంగ్రెస్ నేతలతో భేటీ సందర్భంగా ఇప్పటికే ఆలస్యమైందని త్వరపడాలనే మాట కమల్ నోటి వెంట వచ్చిందని.. అంటే దీని ఉద్దేశ్యం పొత్తు గురించేనని విశ్లేషకులు అంటున్నారు. కాగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం రోజున కమల్ బెంగళూరు విచ్చేసి.. పలు పార్టీల అధినేతలతో సమావేశమయ్యారు. వీరందరిలోకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియా గాంధీలనే ముందుగా కలుసుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ నేతలతో లోకనాయకుడు టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఈ అనుబంధంతోనే కమల్ హాసన్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలనకు కలిశారనే టాక్ వినిపిస్తుంది. నిన్న కేజ్రీవాల్‌ను కలిసిన కమల్ రాజకీయాల గురించి ఆయన వద్ద నుంచి కొన్ని సలహాలు, సూచనలు తీసుకున్నారు.