అసోం యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 2వ అంతస్తు నుంచి దూకేసిన విద్యార్థి.. ఐదుగురు అరెస్టు
అసోంలోని దిబ్రుగడ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ల ర్యాగింగ్ నుంచి తప్పించుకోవడానికి ఓ జూనియర్ స్టూడెంట్ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు. అతడినిక క్రిటికల్ కండీషన్లో హాస్పిటల్ తరలించాడు. సీఎం స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.
గువహతి: ఈశాన్య రాష్ట్రం అసోంలో దిబ్రుగడ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ఒక మాజీ విద్యార్థి, నలుగురు ప్రస్తుత విద్యార్థులు కలిసి జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. ఈ ర్యాగింగ్ నుంచి తప్పించుకోవడానికి ఓ జూనియర్ స్టూడెంట్ ఆనంద్ శర్మ (కామర్స్ డిపార్ట్మెంట్) హాస్టల్లో సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు. అతడిని క్రిటికల్ కండీషన్లో హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనపై సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ర్యాగింగ్ కేసులో దిబ్రుగడ్ యూనివర్సిటీ స్టూడెంట్ గాయపడినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై దగ్గరగా పర్యవేక్షిస్తున్నామని, జిల్లా అధికారులతో సమన్వయంలో పని చేస్తామని పేర్కొన్నారు. నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు. బాధితుడికి మెడికల్ కేర్ అందిస్తున్నామని చెబుతూ.. విద్యార్థులు ర్యాగింగ్ విడనాడాలని అప్పీల్ చేశారు.
గాయపడిన విద్యార్థి తల్లి సరిత శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిందని, అందులో సంచలన ఆరోపణలు చేసినట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మెంటల్లీ, ఫిజికల్లీ వేధింపుల కారణంగానే ఈ ఘటన జరిగినట్టు ఆమె పేర్కొంది. తమ కుమారుడిని చంపేయాలని, డబ్బు దొంగిలించాలని, మొబైల్ ఫోన్ లాక్కోవాలని ప్రయత్నించారని ఫిర్యాదులో తెలిపారు. బాధితుల చేతిలో బలవంతంగా ఆల్కహాల్, గంజాయ్ పెట్టి ఫొటోలు తీసుకున్నారని, తద్వారా భవిష్యత్లో ఏది జరిగినా వారిని వారు రక్షించుకోవడానికి సిద్ధం అయ్యారని ఆరోపణలు చేశారు.
Also Read: మళ్లీ ర్యాగింగ్ భూతం.. మైనర్ బాలికను ఫ్రెషర్తో బలవంతంగా ముద్దు పెట్టించిన మూక.. వైరల్ వీడియో
గతంలోనూ ఆనంద్ శర్మ ర్యాగింగ్ పై సీ బ్లాక్ వార్డెన్కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నవంబర్ 17వ తేదీన తనను వేధిస్తున్న వారి పేర్లను ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.