మళ్లీ ర్యాగింగ్ భూతం.. మైనర్ బాలికను ఫ్రెషర్తో బలవంతంగా ముద్దు పెట్టించిన మూక.. వైరల్ వీడియో
ఒడిశాలో మరో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన మైనర్ బాలికను బలవంతంగా ఒక స్టూడెంట్తో కిస్ చేయించిన ఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని ఓ కాలేజీలో ఓ ఫ్రెషర్ మైనర్ బాలికకు ఓ బాలుడితో ముద్దు పెట్టించారు. ఆ బాలికను బలవంతంగా కూర్చోబెట్టుకుని ఇంకో స్టూడెంట్ను దూషిస్తూ అతడితో ముద్దు పెట్టించారు. ఆ తర్వాత బాలిక లేచి వెళ్లిపోబోతున్నా పక్కనే ఉన్న సీనియర్ ఒకడు ఆ అమ్మాయి చేయి పట్టుకుని మరీ బలవంతంగా కూర్చోబెట్టాడు. మరోసారి ఆ ఫ్రెషర్ను అక్కడ కూర్చోబెట్టి ర్యాగింగ్ చేసే ప్రయత్నం చేయగా.. ఆ బాలుడు వాదించాడు. దీంతో ఆ బాలుడి చెంప చెళ్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఘటనలో నిందితులపై లైంగిక వేధింపులు సహా ఇతర అభియోగాల కింద కేసు పెట్టారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న 12 మంది విద్యార్థులను కాలేజీ నుంచి బహిష్కరించారు. ఈ ఘటన ఒడిశా జిల్లా గాంజాం జిల్లాలో చోటుచేసుకుంది.
ఆ మైనర్ బాలిక నెల క్రితమే ఆ కాలేజీలో జాయిన్ అయింది. ఆ బాలికను ఓ గ్రౌండ్ దగ్గర పట్టుకుని ర్యాగింగ్ చేశారు. మరో బాలుడినీ ర్యాంగింగ్ చేస్తున్న ఆ సీనియర్లే ముద్దు పెట్టాలని ప్రేరేపించినట్టు వీడియో ద్వారా తెలుస్తున్నది. ఆ బాలుడు వారి మాటలను అంగీకరిస్తూ ఎదురుగా కూర్చుని ఉన్న మైనర్ బాలికను కిస్ చేశాడు. ఆ తర్వాత ఆమె లేచి నిలబడి వెళ్లే ప్రయత్నం చేసింది. వెంటనే ఆ సీనియర్ మళ్లీ చేయి పట్టుకుని కూర్చోబెట్టాడు. ఆ నిందితుడు చేతిలో కర్ర పట్టుకుని కనిపించాడు. ముద్దు పెట్టకుండా వాదన పెట్టుకుని ఆ బాలుడిని కూడా చెంపపై కొట్టారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ ర్యాగింగ్ జరుగుతుండగా పక్కనే ఇతర అమ్మాయిలూ ఉన్నారు. కానీ, ఆ మైనర్ బాలికను ఆదుకోకుండా నవ్వుతూ కనిపించారు.
Also Read: బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం.. పోలీసులకు చేరిన వ్యవహారం
ఈ ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులను గుర్తించారు. డిసిప్లినరీ కమిటీ, యాంటీ ర్యాగింగ్ సెల్స్ వారిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్టు కాలేజీ ప్రిన్సిపల్ తెలిపారు.
ఐదుగురు విద్యార్థులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోక్సో యాక్ట్, ఐటీ యాక్ట్ వంటి సెక్షన్ల కింద వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. మైనర్లను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అభిషేక్ నాహక్ అని తెలుస్తున్నది.