బెంగళూరు థియేటర్ లో ‘ది కేరళ స్టోరీ’ చూసిన నడ్డా.. విషపూరిత ఉగ్రవాదాన్నిసినిమా బహిర్గతం చేస్తుందంటూ కామెంట్స్
జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కర్ణాటకలో వీక్షించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు, ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఈ సినిమాను చూశారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ఆదివారం చూశారు. బెంగళూరులోని గరుడ మాల్ లో వేసిన స్పెషల్ షోకు కర్ణాటక శాఖ బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజే, రాజీవ్ చంద్రశేఖర్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై, బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్యతో కలిసి నడ్డా ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ‘కళ్లు తెరిపిస్తుంది’ అని అన్నారు.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు హతం
మందుగుండు సామగ్రి అవసరం లేని కొత్త రకం టెర్రరిజం ఉందని, విషపూరిత ఉగ్రవాదాన్ని ఈ సినిమా బహిర్గతం చేస్తుందని తెలిపారు. ఈ తరహా ఉగ్రవాదానికి ఏ రాష్ట్రానికో, మతానికో సంబంధం లేదన్నారు. ఈ సినిమా చూశాక మన సమాజాన్ని శూన్యం చేయడానికి ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో ప్రజలకు అర్థమవుతుందని జేపీ నడ్డా అన్నారు. ఈ విషయం మనం తెలుసుకోవాలని సూచించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రచారం నిర్వహించడానికి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ సినిమా చూశారు.
అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించిన 'ది కేరళ స్టోరీ' కేరళలోని మహిళల సమూహం చుట్టూ తిరుగుతుంది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్లాల్ షా నిర్మించిన ఈ సినిమా విడుదలపై స్టే ఆర్డర్ ఇవ్వడానికి కేరళ హైకోర్టు నిరాకరించడంతో మే 5న థియేటర్లలోకి వచ్చింది.
కేరళకు చెందిన 32 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని, ఆ తర్వాత ఐసిస్ లో చేరారని చూపించిన ఈ సినిమా ట్రైలర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నిర్మాతలు స్పందించారు. ఈ సినిమా కేరళకు చెందిన ముగ్గురు మహిళల కథ అని వివరించారు. కాగా.. గత శుక్రవారం కర్ణాటకలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమాపై వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. దీంతో ఈ చిత్రం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.