కాపీ కొడుతున్నదనే అనుమానంతో పరీక్ష రాస్తున్న బాలిక బట్టలు విప్పించాడు.. అవమానంతో నిప్పంటించుకున్న విద్యార్థిని
జార్ఖండ్లో ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని కాపీ కొడుతున్నదనే అనుమానంతో తనిఖీలు చేశారు. ఆమె యూనిఫామ్లో చిట్టీలు ఉన్నాయని టీచర్ అనుమానించాడు. దీంతో క్లాస్ రూమ్ పక్కనే ఉన్న గదికి ఆమెను తీసుకెళ్లి బట్టలు విప్పించాడు. ఈ ఘటనతో బాలిక కుంగిపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటికి నిప్పు పెట్టుకుంది.
రాంచీ: జార్ఖండ్లో తొమ్మిదో తరగతికి చెందిన ఓ బాలిక పరీక్ష గదికి వెళ్లింది. పరీక్ష రాస్తున్నది. ఇన్విజిలేటర్కు ఆమె కాపీ కొడుతున్నట్టు అనుమానం వచ్చింది. దీంతో బలవంతంగా ఆమె బట్టలు విప్పించాడు. ఈ ఘటన బాలిక మనసును తీవ్రంగా గాయపరిచింది. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె ఒంటికి నిప్పు అంటించుకుంది. ఆ తర్వాత ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లారు. తీవ్ర గాయాలపాలైన ఆ బాలిక ప్రస్తుతం చావు బతుకుల నడుమ పోరాడుతున్నది. జార్ఖండ్లోని జంషేడ్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసు అధికారుల సమాచారం ప్రకారం, ఆ తొమ్మిదో తరగతి బాలిక తన యూనిఫామ్లో చిట్టీలు దాచుకుని ఉంటుందని టీచర్ అనుమానించాడు. అందుకే ఆమె బట్టలు తొలగించి చిట్టీలు ఉన్నాయా? లేవా? అని కనుగొనాలని అనుకున్నాడు. ఆ టీచర్ తనను అవమానపరిచాడని సదరు విద్యార్థిని తన స్టేట్మెంట్లో వెల్లడించింది. క్లాస్ రూమ్కు పక్కనే ఉన్న గదిలో ఆమె బట్టలు తొలగించారని, తన యూనిఫామ్లో చిట్టీలు దాచి పెట్టానేమో అని చెక్ చేశారని వివరించింది. తన వద్ద లేవని ఎంత వారించినా వారు పట్టించుకోలేదని పేర్కొంది.
Also Read: చదవుకోనివ్వకుండా పెళ్లి చేసేస్తారని.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య..
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైందని పోలీసులు వివరించారు. టీచర్ పై కేసు ఫైల్ అయిందని, తాము దర్యాప్తు మొదలు పెట్టామని తెలిపారు.
తమ కూతురు యూనిఫామ్ను తొలగించడాన్ని భరించలేకపోయిందని ఆమె తల్లి స్టేట్మెంట్లో పేర్కొంది. అందుకే ఆమె స్కూల్ నుంచి ఇంటికి తిరిగి రాగానే ఒంటికి నిప్పు అంటించుకున్నదని వివరించింది.