ఆ సమయంలో విమానంలో 149మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా క్షేమంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.  

సౌదీ అరేబియా టూ ముంబయి వస్తున్న జెట్ ఎయిర్ వేస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానం రియాద్ ఎయిర్ పోర్టులో టేక్ ఆఫ్ అవుతుండగా రన్ వేపై జారింది. పైలెట్ అప్రమత్తం అవడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో 149మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా క్షేమంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. 

‘142మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో ఆగస్టు 3న రియాద్‌ నుంచి ముంబయికి రావాల్సిన 9డబ్ల్యు523 విమానం టేకాఫ్‌ ఆగిపోయింది. రియాద్‌ విమానాశ్రయంలోని రన్‌వే నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. మా ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. అందరినీ విమానం నుంచి బయటకు తరలించాం. ఎవ్వరికీ గాయాలు కాలేదు’ అని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఓ ప్రకనటలో వెల్లడించింది. 

స్థానిక అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, తమ బృందం వారికి పూర్తి సహకారం అందిస్తోందని తెలిపింది. తమకు ప్రయాణికులు, సిబ్బంది భద్రత చాలా ముఖ్యమని జెట్‌ ఎయిర్‌వేస్‌ పేర్కొంది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు రియాద్‌ విమానాశ్రయంలోని టర్మినల్‌ భవనంలో బస ఏర్పాటు చేసినట్లు తెలిపింది.