National Herald Case: ఆ కేసులో రాహుల్ గాంధీని వేధిస్తున్నారు: హెచ్డి కుమారస్వామి
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని దర్యాప్తు సంస్థ వేధిస్తోందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రశ్నించడం రాజకీయ ప్రాతిపదికన జరిగిందని విమర్శించారు.
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పదే పదే ప్రశ్నిస్తూ వేధింపులకు గురి చేసిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్ నాయకుడు హెచ్డి కుమారస్వామి ఆరోపించారు. రాహుల్ గాంధీని నిరంతరం విచారణకు పిలుస్తున్నారనీ, ఇప్పటికే ఐదు రోజులు విచారించారని తెలిపారు. అన్ని రిజిస్ట్రేషన్లు, సమాచారం ED అందుబాటులో ఉన్నాయనీ, వారు అన్ని విచారణలను అరగంటలో ముగించగలరని అని కుమారస్వామి అన్నారు. రాహుల్ గాంధీ ప్రశ్నించడం రాజకీయ ప్రాతిపదికన జరిగిందని ఆయన ఆరోపించారు.
సైనిక బలగాల నియామకం కోసం కేంద్రం అమల్లోకి తెచ్చిన అగ్నిపథ్ స్కీం పై కుమార స్వామి మాట్లాడుతూ.. విమర్శాస్త్రాలు సంధించారు. అగ్నిపథ్ అమలు వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) రహస్య ఎజెండా దాగి ఉందని ఆరోపించారు. సైన్యంపై పట్టు సాధించేందుకు బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆరెస్సెస్ ప్రతిపాదించిన పథకమే అగ్నిపథ్ అని అన్నారు. జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ పార్టీ.. సైన్యంపై పట్టు సాధించినట్లే.. ఆరెస్సెస్ కూడా అలాగే ప్రయత్నిస్తున్నదా? అని ప్రశ్నించారు.
అగ్నిపథ్ అంశంపై మాట్లాడేందుకు ఢిల్లీ ఇక్కడ లేదు. కేంద్ర ప్రభుత్వానికి అగ్నిపథ్ భావనను అందచేసిందెవరు.. ఏ పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. సైనిక బలగాల్లో 10 లక్షల మందిని నియమించడానికి అగ్నిపథ్ స్కీమ్ ప్రారంభించాలని ప్రతిపాదన ఎక్కడ నుంచి వచ్చిందనీ, రక్షణ శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనేనా? ఈ సలహా ఇచ్చిందెవరు?` అని కుమారస్వామి నిలదీశారు. అగ్నిపథ్ ఆరెస్సెస్ రహస్య ఎజెండా అని, నాలుగేండ్ల సర్వీసు పూర్తయిన 75 శాతం అగ్నివీరులను ఆరెస్సెస్ తమ శక్తిగా మార్చుకోబోతుందని ఆరోపించారు.
మరోవైపు..ఈడీ విచారణ (ed inquiry) పేరుతో తనను వేధించాలనుకున్నారని కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) మండిపడ్డారు. కానీ మోడీ (narendra modi) ప్రభుత్వ ఆకాంక్ష నెరవేరలేదని.. కాంగ్రెస్ నేతలన్ని ఎవరూ భయపెట్టలేరని, అణగదొక్కలేరని రాహుల్ స్పష్టం చేశారు. తనను విచారించిన అధికారికి ఈ విషయం అర్ధమైపోయిందని.. కాంగ్రెస్ పార్టీ సత్యం కోసం పోరాడుతోందని ఆయన పేర్కొన్నారు. సత్యానికీ సహనం వుంటుందని.. అబద్ధం అలసిపోతుందని, సత్యం ఎప్పటికీ అలసిపోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
మరోవైపు.. నేషనల్ హెరాల్డ్-మనీలాండరింగ్ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా విచారణకు పిలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్.. బీజేపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగం, నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు పై విచారణ సంస్థ ఐదో రోజు ప్రశ్నిస్తున్న పార్టీ అధినేత రాహుల్ గాంధీని వేధింపులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం సత్యాగ్రహం దీక్షను చేపట్టింది.