సారాంశం
వికలాంగుడు అని కూడా చూడకుండా ఇద్దరు జవాన్లు అతడిపై తీవ్రంగా దాడి చేశారు. ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని దేవరియా ప్రాంతంలో చోటు చేసుకుంది.
తాగేందుకు నీళ్లు అడిగినందుకు ఓ వికలాంగుడిపై జవాన్లు దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని దేవరియా ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల సచిన్సింగ్ 2016లో జరిగిన రైలు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడు తన కాళ్లను కోల్పోవలసి వచ్చింది.
అయితే ప్రస్తుతం స్థానికంగానే నివసిస్తూ జీవనోపాధి కోసం సిమ్ కార్డులను విక్రయిస్తుంటాడు. అలాగే దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లో డెలివరీ బాయ్ గా కూడా పని చేస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే పనులు పూర్తి చేసుకొని తన త్రీ వీలర్ పై శనివారం రాత్రి ఇంటికి బయలుదేరాడు. మధ్యలోని ఓ గుడి దగ్గరలో రోడ్డుపై అతడికి ఓ తాబేలు కనిపించింది.
దానిని చూసి సచిన్ జాలి పడ్డాడు. రోడ్డుపై ఉంటే ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉందని భావించి తన త్రీ వీలర్ పై నుంచి కిందికి దిగాడు. తాబేలును చేతిలో పట్టుకొని, ఆలయ ప్రాంగణంలో ఉన్న కొలను వద్దకు వెళ్లి, నీటిలో వదిలేశాడు. అనంతరం తన వాహనం దగ్గరికి తిరిగి వచ్చాడు. అక్కడ ప్రాంతీయ రక్షక్దళ్ కు చెందిన ఇద్దరు జవాన్లు ఉన్నారు. వారిని చూసి.. తాగేందుకు నీళ్లు ఉంటే ఇవ్వాలని కోరాడు. దీంతో ఆ జవాన్లకు కోపం వచ్చింది.
ఇష్టమొచ్చినట్టు తిడుతూ వికలాంగుడిపై దాడి చేశారు. దీనిని దగ్గరలో ఉన్న బిల్డింగ్ నుంచి ఒకరు వీడియో తీశారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది వైరల్ గా మారింది. ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. దీంతో ఆ ఇద్దరు జవాన్లను విధుల నుంచి తొలగించారు.