Rahul Gandhi: "నెహ్రూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తే.. బీజేపీ నిర్వీర్యం చేస్తుంది": బీజేపీ పై రాహుల్ ఫైర్
Rahul Gandhi: భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ..ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేసిన వ్యక్తి అని, అయితే భారతీయ జనతా పార్టీ గత ఎనిమిదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందని దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం అన్నారు.
Rahul Gandhi: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీ స్వయం ప్రతిపత్తి గల సంస్థలను బుల్డోజర్ చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిందని అన్నారు.భారత దేశ ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేసిన సంస్థల నిర్మాతగా నెహ్రూను అభివర్ణించారు. మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు భారతదేశానికి “భారత్ జోడో” అవసరమని ఆయన అన్నారు. మహత్మా గాంధీ జయంతి రోజున కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ "భారత్ జోడో" యాత్రను నిర్వహిస్తోంది.
పండిట్ నెహ్రూ దేశంలో కీలక వ్యవస్ధలను నిర్మిస్తే.. కాషాయ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుందని రాహుల్ ఆరోపించారు. IIT, IIM, LIC, ITI, BHEL, NID, BARC, AIIMS, ISRO, ONGC, DRDO, వంటి ప్రతిష్టాత్మక సంస్ధలను నెహ్రూ నిర్మించారని, నెహ్రూ జీ మన ప్రజాస్వామ్య మూలాలను పటిష్టం చేసిన సంస్థ నిర్మాతని కొనియాడారు. కానీ, 8 సంవత్సరాలలో.. BJP ప్రభుత్వం ఆ సంస్థలను బుల్డోజింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశానికి గతంలో కంటే ఇప్పుడు #BharatJodo యాత్ర అవసరమని అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
నెహ్రూను స్మరించుకుంటూ మరో ట్వీట్లో.. “ఆయన మరణించిన 58 సంవత్సరాల తరువాత కూడా, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆలోచనలు, రాజకీయాలు.. మన దేశం పట్ల ఆయన చూపిన దార్శనికత గతంలో మాదిరిగానే ఉన్నాయి. ఈ అమర భారత పుత్రుని విలువలు ఎల్లప్పుడూ మన చర్యలకు, మనస్సాక్షికి మార్గనిర్దేశం చేస్తాయి అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.
అంతకుముందు పండిట్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ప్రధాని తన ట్వీట్లో “పండిట్ జవహర్లాల్ నెహ్రూ జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు” అని ప్రధాని రాశారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కూడా భారత తొలి ప్రధానికి నివాళులర్పించింది. "ఒక వీర స్వాతంత్ర్య సమరయోధుడు, ఆధునిక భారతదేశ రూపశిల్పి, రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, దేశభక్తుడు, పండిట్. జవహర్లాల్ నెహ్రూ భారతదేశ మాతకు నిజమైన కుమారుడు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు శతకోటి వందనాలు, శతకోటి నివాళులు. ' అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
Bharat Jodo Yatra .. 2024 ఎన్నికల్లో ఎలాగైనా.. అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా.. ఎన్నికల్లో పోటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్రకు నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలు కానుంది. భారత్ జోడో యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రాహుల్ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమించింది.