Asianet News TeluguAsianet News Telugu

పుల్వామాలో ఉగ్రదాడి.. ఒక వ‌ల‌స కార్మికుడు మృతి

Terror attack in Pulwama: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ఒక వలస కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. లక్షిత హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
 

Jammu And Kashmir: Terror attack in Pulwama.. one migrant worker Killed
Author
Hyderabad, First Published Aug 5, 2022, 1:30 AM IST

Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో ఒక వలస కార్మికుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. జ‌మ్మూకాశ్మీర్ కు ప్ర‌త్యేక హోదా క‌ల్పించే  ఆర్టిక‌ల్ 370ని రద్దు చేసి మూడో వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ ఉగ్ర‌వాదులు ఈ దాడుల‌కు పాల్ప‌డ్డారు. జ‌మ్మూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లాలోని గదూరా గ్రామంలో స్థానికేతర కార్మికులపై ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. ఈ దాడిలో ఒక‌రు చ‌నిపోగా.. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రులు పుల్వామా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ఉగ్ర‌దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్య‌క్తి బీహార్‌లోని సక్వా పరాస్‌కు చెందిన మహ్మద్ ముంతాజ్‌గా గుర్తించారు. గాయపడిన బీహార్‌కు చెందిన మహ్మద్ ఆరిఫ్, మహ్మద్ మక్బూల్‌లను ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆగస్ట్ 5, 2019న జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా, ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తిని తొలగించిన సంగ‌తి తెలిసిందే. జ‌మ్మూకాశ్మీర్ చరిత్రలో ప్రాంతీయ పార్టీలు దీనిని చీకటి రోజుగా పాటిస్తున్నాయి. అక్టోబర్ 2019 నుండి, స్థానికేతర కార్మికులను తరచుగా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. వారిపై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. కాశ్మీరీ పండిట్‌లు, హిందువులపై లక్ష్యంగా దాడులు జరగడం పెద్ద భద్రతా సవాలుకు కారణమైంది.

మే, జూన్‌లలో జరిగిన వరుస లక్షిత దాడుల తర్వాత వేలాది మంది కాశ్మీరీ పండిట్ ఉద్యోగులు, అలాగే, జమ్మూలోని ఉద్యోగులు కూడా కాశ్మీర్ లోయలో తమ విధులకు హాజరుకావడం లేదు. ఈ లోయలో తమకు భద్రత లేదని భావించిన చాలా మంది ఉద్యోగులు జమ్మూకి మారారు. లక్షిత హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర‌దాడుల‌ను నివారించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. 

ఇక తాజా దాడిని ఖండిస్తూ శ్రీనగర్ మాజీ డిప్యూటీ మేయర్ షేక్ ఇమ్రాన్ హింసను ఎప్పటికీ సమర్థించలేమని అన్నారు. "పుల్వామాలో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయిన స్థానికేతర కార్మికులపై జరిగిన దారుణమైన దాడిని నేను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను. హింసను దాని అభివ్యక్తిలో ఎప్పటికీ సమర్థించలేము. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంఘీభావం & క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాన‌ని" తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios