తీవ్రవాది నుంచి పెర్ఫ్యూమ్ ఐఈడీని స్వాధీనం చేసుకున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు.. అదేంటంటే ?
నార్వాల్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న లష్కరే తోయిబా సభ్యుడు ఆరిఫ్ అహ్మద్ ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతడి వద్ద నుంచి పెర్ఫ్యూమ్ ఐఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి పరికరం తాము ఎప్పుడూ చూడలేదని వారు వెల్లడించారు.
తీవ్రవాదులు కూడా అప్ డేట్ అవుతున్నారు. కొత్త టెక్నాలజీ ద్వారా పేలుడు పదార్ధాలను కొత్త రూపాల్లో తయారు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో జనవరి 21తేదీన జరిగిన పేలుళ్లలో ప్రధాన నిందితుడైన లష్కరే తోయిబా సభ్యుడు, ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆరిఫ్ అహ్మద్ ను పట్టుకున్నారు. అయితే అతడి వద్ద నుంచి రికవరీ చేసిన పేలుడు పదర్థాల్లో ఓ కొత్త పరికరాన్ని గుర్తించామని పోలీసులు వెల్లడించారు. అదే పెర్ఫ్యూమ్ ఐఈడీ. ఇలాంటి పరికరం తామెప్పుడూ చూడలేదని తెలిపారు.
ఈ విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ జమ్మూలో మీడియాతో మాట్లాడారు. “మేము పెర్ఫ్యూమ్ ఐఈడీని రికవరీ చేయడం ఇదే మొదటిసారి. మేము ఇంతకు ముందు ఇలా ఏ పెర్ఫ్యూమ్ ఐఈడీని పొందలేదు. దీనిని ఎవరైనా నొక్కడానికి లేదా తెరవడానికి ప్రయత్నిస్తే ఐఈడీ పేలుతుంది. మా ప్రత్యేక బృందం ఆ ఐఈడీని మెయింటేన్ చేస్తోంది’’ అని తెలిపారు.
‘‘ఇప్పటి వరకు మేము పేలుడు పదార్థాలు, అంటుకునే బాంబులు, టైమర్-బిగించిన ఐఈడీలను చూశాం. అయితే ఆరిఫ్ దగ్గర నుంచి కొత్త రకం ఐఈడీని స్వాధీనం చేసుకున్నాం. ఈ ఐఈడీ బాటిల్ రూపంలో ఉంది. అలాగే పెర్ఫ్యూమ్ బాటిల్ లాగా ఉంది. కానీ అందులో పేలుడు పదార్థం కూడా ఉంది.’’ అని డీజీపీ అన్నారు. “ఈ ఐఈడీ మనకు కొత్తది కాబట్టి నిపుణులు దానిని పరిశీలిస్తున్నారు. అది ఎంత శక్తివంతమైనదో చూస్తారు. దానిని ఎవరూ ఇంత వరకు తాకలేదు.” అని తెలిపారు.
నిందితుడు డిసెంబరు చివరి నాటికి మూడు ఐఈడీలను సరఫరా చేశాడని, అతడు మార్వాల్ ప్రాంతంలో రెండు ఐఈడీలను ఉపయోగించాడని డీజీపీ తెలిపారు. నిందితుడు పాకిస్తాన్ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న లష్కరే-ఇ-తొయిబా ఉగ్రవాది ఖాసీం చెప్పినట్టు చేస్తున్నాడని అన్నారు. ఆరిఫ్ ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. ఆరిఫ్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే లష్కరే తోయిబా గ్రూపు కోసం యాక్టివ్ గా పని చేస్తున్నట్టు డీజీపీ తెలిపారు.