జహంగీర్పురి హింసాకాండ కేసు.. నిందితులకు బెయిల్ మంజూరు.. ఒక రోజు తరువాత మళ్లీ అరెస్టు.. ఎందుకంటే ?
ఈ ఏడాది హనుమాన్ జయంతి సందర్భంగా జహంగీర్పురిలో అల్లర్లు చెలరేగాయి. ఇందులో నిందితులుగా ఉన్న పలువురికి కోర్టు బెయిల్ శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. వారు శనివారం విడుదల అయ్యారు. అయితే ఆదివారం వారిని పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు.
జహంగీర్పురి హింసాకాండలో బెయిల్పై ఉన్న ఇద్దరు నిందితులతో పాటు మరో ఇద్దరిని ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని అర్బాజ్, జునైల్తో పాటు జహంగీర్పురి హింసాకాండలో నిందితులుగా ఉన్న అన్సార్, జకీర్లు ఉన్నారు. అయితే వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీ నుంచి కస్టడీలో ఉన్న ప్రధాన నిందితులలో ఒకరైన అన్సార్కు శుక్రవారం ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తయినందున అతడి కస్టడీని దృష్టిలో ఉంచుకుని కోర్టు ఉపశమనం అందించింది. అయితే అతడితో పాటు మరి కొందరు నిందితులకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ఊరేగింపులో జహంగీర్పురి ప్రాంతంలో మతపరమైన హింస చెలరేగింది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో నిందితుల పాత్ర ఉందని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న అన్సార్ అలియాస్ మహ్మద్ అన్సార్కు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిని విచారించిన రోహిణి జిల్లా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ నిందితుడికి సొంత పూచీకత్తుతో పాటు రూ. 25 వేల పర్సనల్ బాండ్ ను అందించాలని షరతును విధిస్తూ బెయిల్ మంజూరు చేశారు.
నిందితుడిపై ఇప్పటికే విచారణ పూర్తయిందని, చార్జిషీట్ దాఖలు అయ్యిందని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది. విచారణ ముగియడానికి చాలా సమయం పడుతుందని చెప్పింద. కాబట్టి నిందితులను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని కోర్టు పేర్కొంది. సహ నిందితుల్లో కొందరికి ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిందని పేర్కొంది. మరికొందరి నిందితులకు ఈ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పింది.
అంధేరి ఈస్ట్లో ఉద్ధవ్ థాక్రే వర్గం గెలుపు.. కానీ ట్విస్ట్ ఇచ్చిన ఓటర్లు
బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది సత్నారైన్ శర్మ వాదనలు వినిపిస్తూ.. నిందితుడికి ఈ నేరంతో ఎలాంటి సంబంధం లేదని, స్థానిక పోలీసులు తమ కేసును పరిష్కరించడానికి ప్రస్తుత కేసులో నిందితులను తప్పుగా ఇరికించారని వాదించారు. నిందితుడు ఏప్రిల్ 17 నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడని, నిందితులపై దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని న్యాయవాది తెలిపారు.
బైపోల్స్లో దూసుకెళ్లిన బీజేపీ.. ఏడింట నాలుగు స్థానాలు కమలం కైవసం.. ఫలితాలపై టాప్ పాయింట్స్ ఇవే
కాగా.. జహంగీర్పురి అల్లర్లల్లో అన్సార్ చురుకుగా పాల్గొన్నారని అతడిపై ఛార్జిషీట్ దాఖలు అయ్యింది. హింసాకాడ కోసం జరిగిన చట్టవిరుద్ధమైన సమావేశంలో అతడు సభ్యుడిగా ఉన్నాడని అందులో పోలీసులు పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 16వ తేదీన జరిగిన ఈ హింసాకాండకు సంబంధించి 50 మంది నిందితులపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు ప్రస్తుతం అభియోగాలను రూపొందించే దశలో ఉంది.