అంధేరి ఈస్ట్లో ఉద్ధవ్ థాక్రే వర్గం గెలుపు.. కానీ ట్విస్ట్ ఇచ్చిన ఓటర్లు
దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన అంధేరి ఈస్ట్ స్థానంలో ఉద్థవ్ థాక్రే సారథ్యంలోని శివసేన గెలిచింది. థాక్రే వర్గానికి చెందిన శివసేన అభ్యర్ధి రుతుజా లట్కే దాదాపు 66 వేల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
మునుగోడు ఉపఎన్నిక తర్వాత దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించిన స్థానం అంధేరి ఈస్ట్. శివసేనలో చీలిక తర్వాత జరిగిన తొలి ఉపఎన్నిక కావడంతో ఇక్కడ ఎలాంటి ఫలితం రానుందోనని ఉత్కంఠ నెలకొంది. అంధేరి నుంచి బరిలో నిలిచిన ఉద్థవ్ థాక్రే వర్గానికి చెందిన శివసేన అభ్యర్ధి రుతుజా లట్కే ఘన విజయం సాధించారు. దాదాపు 66 వేల భారీ మెజార్టీతో ఆమె విజయం సాధించారు. రుతుజాపై చిన్నా చితకా పార్టీలకు చెందిన వారు, స్వతంత్రులు ఆరుగురు పోటీ చేశారు. అయితే వీరందరినీ పక్కకు నెట్టి నోటాకు 12,776 ఓట్లు లభించి రెండో స్థానంలో నిలవడం విశేషం.
వాస్తవానికి రుతుజా లట్కే భర్త రమేశ్ లట్కే ఇక్కడ శివసేన నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆయన ఆయన హఠాన్మరణంతో అంధేరి ఈస్ట్లో ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే లోపే శివసేన రెండుగా చీలి... ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు. ఈ క్రమంలో ఉద్ధవ్ వర్గం నుంచి రుతుజాను ఇక్కడి నుంచి బరిలోకి దించారు. బీజేపీ కూడా ముర్జీ పటేల్ను నిలెట్టింది. ఏక్నాథ్ షిండే వర్గంలోని శివసేన కూడా పటేల్కు మద్ధతు పలికింది. అయితే ఎన్సీపీ సహా పలు పార్టీల విజ్ఞప్తి మేరకు బీజేపీ పోటీ నుంచి తప్పుకుంది.
Also REad: బైపోల్స్లో దూసుకెళ్లిన బీజేపీ.. ఏడింట నాలుగు స్థానాలు కమలం కైవసం.. ఫలితాలపై టాప్ పాయింట్స్ ఇవే
ఇకపోతే.. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 3వ తేదీన ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడు స్థానాల్లో ఉపఎన్నికలకు ముందు బీజేపీ మూడు స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలు, శివసేన, ఆర్జేడీలవి ఒక్కో స్థానం. కానీ, ఇక్కడ భిన్న కారణాల రీత్య ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఉపఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడయ్యాయి. ఇందులో బీజేపీ మూడు స్థానాలకు బదులు నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం ఏడు స్థానాల్లో నాలుగు స్థానాలను బీజేపీ గెలుచుకుని ఈ ఉపఎన్నికలో పై చేయి సాధించింది.
ఉత్తరప్రదేశ్లో గోలా గోక్రాన్నాథ్, హర్యానాలోని ఆదంపూర్, బిహార్లోని గోపాల్గంజ్, ఒడిశాలోని ధామ్నగర్లో బీజేపీ విజయపతాక ఎగరేసింది. కాగా, బిహార్లోని మొకామాలో ఆర్జేడీ, తెలంగాణలోని మునుగోడులో టీఆర్ఎస్, మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఈస్ట్ ఆంధేరీలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన పార్టీలు గెలిచాయి. నిజానికి ఆర్జేడీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేనలు వాటి స్థానాల్లో తిరిగి గెలుచుకుని సీటును కాపాడుకున్నాయి. కానీ, కాంగ్రెస్ మాత్రం ఈ ఉపఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన రెండు స్థానాలనూ నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్ రెండు స్థానాలనూ కోల్పోయి.. ఈ ఎన్నికల్లో ఎక్కువగా నష్టపోయిన పార్టీగా మిగిలింది