అది ‘ఆప్’ కాదు ‘పాప్’ - ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ పై బీజేపీ మండిపాటు
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ తో సంబంధం ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ స్కామ్ మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ అని పేర్కొంది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ పై బీజేపీ, ఆప్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలను టార్గెట్ గా చేసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా, బీజేపీ నేత గౌరవ్ భాటియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వారు ఆదివారం మీడియాతో మాట్లాడారు. అది ‘ఆప్’ కాదని, ‘పాప్’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అవినీతిమయంగా మారిందని, ఈ మొత్తం కుంభకోణానికి అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ అని అన్నారు.
కాంగ్రెస్కు మరో షాక్.. కశ్మీర్లో ఆజాద్, హిమాచల్లో ఆనంద్ శర్మ తిరుగుబాటు.. పార్టీ పోస్టుకు రిజైన్
కోవిడ్ ప్రభావిత ప్రజలకు సహాయం చేసే సమయంలో కేజ్రీవాల్ ఎక్సైజ్ పాలసీపై సంతకం చేసి అవినీతికి పాల్పడ్డారని భాటియా ఆరోపించారు. 2024లో మోదీ వర్సెస్ కేజ్రీవాల్ అని ఆప్ చెబుతోందని, కానీ యూపీ, ఉత్తరాఖండ్, గోవాలో ఏం జరిగిందో అందరికీ తెలుసని చెప్పారు. ఎక్సైజ్ పాలసీ ‘కుంభకోణం’ మూలాలు అవినీతిపరుడైన కేజ్రీవాల్ ఇంటి గుమ్మానికి దారితీస్తాయని తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, అవినీతిపరులెవరూ వదిలిపెట్టరని అన్నారు.
‘ఐఎస్ఐ మార్క్ హామీ కంటే ఆప్ అవినీతి పెద్ద గ్యారెంటీ. రెండు రాష్ట్రాల్లోని ఆప్ ప్రభుత్వాలు, ఇద్దరు ఆరోగ్య మంత్రులు, ఇద్దరూ అవినీతి ఆరోపణలపై జైలులో ఉన్నారు.. ఈ రోజు భారతదేశ ప్రజలు - యే ఆప్ నహీ, పాప్ హై; భ్రష్టచార్ కా బాప్ హై, ఔర్ జనతా కే లియే అభిషాప్ హై (ఇది పాపం... ఆప్ కాదు, అవినీతికి పితామహుడు, ప్రజలకు శాపం) అని భాటియా అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్సైజ్ పాలసీ సరైనదే అయితే దానిని ఎందుకు ఉపసంహరించుకున్నారని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ సెకెండ్ వేవ్ వచ్చినప్పుడు ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ దేశం మొత్తానికి అండగా నిలిచిందని అన్నారు. ఆ సమయంలో అందరికీ మందులు అందాయని, ఆసుపత్రిల వ్యవస్థ మెరుగుపడిందని తెలిపారు. అయితే ఆ సమయంలోనే సీఎం కేజ్రీవాల్ మందులు, పడకలు, ఆక్సిజన్ ఏర్పాట్లపై శ్రద్ధ పెట్టాల్సి ఉండగా ఆ అవినీతి పెన్ ఎక్సైజ్ పాలసీపై సంతకం చేయడంలో నిమగ్నమై ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు.
కుల వ్యవస్థను పూర్తిగాా తొలగించాలి - కాంగ్రెస్ నాయకురాలు, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్
ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయి అంటూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంతో పాటు 31 ప్రాంతాల్లో సీబీఐ శుక్రవారం దాడులు చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బీజేపీని నిందించింది. కాగా ఆదివారం సీబీఐ తన పేరిట లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసిందంటూ వచ్చిన వార్తలపై సిసోడియా స్పందించారు. ‘‘ మీరు చేసిన అన్ని రైడ్ లు ఫెయిల్ అయ్యాయి. ఒక్క పైసా కూడా అవినీతి జరిగిందని నిరూపితం కాలేదు. ఇప్పుడు మనీష్ సిసోడియా పరారీలో ఉన్నాడని మీరు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు, ఈ జిమ్మిక్కు ఏమిటి మోడీ జీ? నేను బహిరంగంగా ఢిల్లీలో తిరుగుతున్నాను, నేను ఎక్కడకు రావాలో చెప్పండి? ’’ అని సిసోడియా హిందీలో ట్వీట్ చేశారు.
సిసోడియా ట్వీట్ పై బీజేపీ నేత పర్వేష్ వర్మ స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘ లుక్ అవుట్ సర్క్యులర్ అంటే పోలీసులు మీ కోసం వెతుకుతున్నారని అర్థం కాదు. కానీ మీరు దేశం విడిచి వెళ్లలేరని దీని అర్థం’’ అని వర్మ అన్నారు. కాగా..ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో నిందితులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఎల్ఓసీ జారీ చేయలేదని సీబీఐ వర్గాలు స్పష్టం చేశాయి.