పార్లమెంటును శవపేటికతో పోల్చడం తప్పు - అసదుద్దీన్ ఒవైసీ.. ఆర్జేడీ తీరుపై ఫైర్
పార్లమెంట్ కొత్త భవనాన్ని శవపేటికతో పోల్చడం తప్పని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆర్జేడీ తీరుపై ఆయన మండిపడ్డారు. ఆ పార్టీకి స్టాండ్ లేదని విమర్శించారు.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కొత్త పార్లమెంటు భవనం డిజైన్ ను శవ పేటికతో పోల్చడం వివాదానికి దారితీసింది. ఆర్జేడీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ కొత్త పార్లమెంటు భవనం, శవపేటిక ఫొటోను పక్కపక్కన పెట్టి షేర్ చేస్తూ.. దానికి ‘ఇదేమిటి?’ (యే క్యా హై) అనే క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేసింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నుంచే కాకుండా పలు విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఆ పార్టీపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఆర్జేడీపై ఫైర్ అయ్యారు.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంపం.. చుట్టుపక్కల నగరాల్లోనూ భూప్రకంపనలు.. ట్విట్టర్ లో మీమ్స్ వైరల్
‘‘ఆర్జేడీకి స్టాండ్ లేదు, పాత పార్లమెంటు భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ కూడా లేదు. వారు (ఆర్జేడీ) పార్లమెంటును శవపేటిక అని ఎందుకు పిలుస్తున్నారు? అది కాకుండా వారు ఇంకెలాగైనా విమర్శించవచ్చు. ఈ కోణాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏమిటి?’’ అని ఆయన ప్రశ్నించారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కొత్త పార్లమెంటును ప్రారంభిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్జేడీ పోస్టుపై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. ఈ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టమని, ఆర్జేడీ వంటి పార్టీలు ఏడుస్తూనే ఉంటాయని అన్నారు. 2024లో దేశ ప్రజలు మిమ్మల్ని అదే శవపేటికలో ఖననం చేస్తారని, ప్రజాస్వామ్యం కొత్త ఆలయంలోకి ప్రవేశించే అవకాశాన్ని మీకు ఇవ్వరని అన్నారు. పార్లమెంటు భవనం దేశానికి, శవపేటిక మీకే చెందుతుందని అన్నారు.
దీనిపై రాష్ట్రీయ జనతాదళ్ స్పందిస్తూ.. తాము భవనాన్ని అగౌరవపర్చడం కాదని, ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నామని చెప్పడమే తమ ఉద్దేశమని పేర్కొంది. ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మా ట్వీట్ లోని శవపేటిక ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడానికి ప్రతీక. పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం. చర్చలకు వేదిక. కానీ దానిని వేరే దిశలో తీసుకెళ్లాలనుకుంటున్నారు. దాన్ని దేశం అంగీకరించదు. ఇది రాజ్యాంగాన్ని, సంప్రదాయాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో అన్నింటిలోనూ రాష్ట్రపతియే సర్వస్వం. ప్రజాస్వామ్యాన్ని శవపేటికలో పెట్టొద్దని ప్రధానిని కోరుతున్నాం’’ అని అన్నారు.