లిక్కర్ పాలసీ స్కామ్ లో కవిత పేరు రావడం యాదృచ్చికం కాదు - బీజేపీ నేత అమిత్ మాలవీయ
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో తెలంగాణ సీఎంకు, ఆయన కుమార్తెకు ప్రమేయం ఉందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య అన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్.. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ ను కలిశారని చెప్పారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత కు ప్రమేయం ఉందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య మంగళవారం ఆరోపించారు. కవిత, కేసీఆర్ లు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ లతో కలిసి పర్యటించారని అన్నారు. ఇప్పుడు లిక్కర్ బ్యారన్లతో సమావేశాలు నిర్వహించి, సిసోడియాకు రూ.4.5 కోట్లు లంచం ఇచ్చినట్టు పేరు ప్రస్తావనకు రావడం యాదృచ్ఛికం కాదని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఎక్సైజ్ పాలసీ 2021-22 కేసుకు సంబంధించి డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియాతో పాటు 13 మందిపై, రెండు కంపెనీలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో అమిత్ మాలవీయ ఈ ఆరోపణలు చేశారు.
ఎవరీ సోనాలి ఫోగట్? ఎంతో కీర్తి, వివాదాలతో సాగిన ఆమె కెరీర్ వివరాలు ఇవిగో..
కాగా.. లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, ఆ పార్టీ నేత మంజిందర్ సింగ్ సిర్సాపై హైదరాబాద్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లా కోర్టుల్లో కూడా పరువు నష్టం దావాలు వేశారు. ఈ స్కాంతో తనకు సంబంధం లేకున్నా కావాలనే బీజేపీ నేతలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని సోమవారం ఆమె ఆరోపించారు.
కాగా.. మే 22వ తేదీన ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలోని తన అధికారిక నివాసంలో కేసీఆర్ ను కలిశారు. తెలంగాణ సీఎం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు, మొహల్లా క్లినిక్ లను కూడా సందర్శించారు. మే 23న చండీగఢ్ లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను కూడా కేసీఆర్ కలిశారు.
కాగా.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సోమవారం బీజేపీపై ఆరోపణలు చేశారు. బీజేపీ తనకు సీఎం పదవిని ఆఫర్ చేసిందని అన్నారు. ఆప్ ను విడిచిపెట్టి, బీజేపీలో చేరాలని తనకు సందేశం వచ్చిందని చెప్పారు. అలా చేస్తే తనపై సీబీఐ, ఈడీ పెట్టిన అన్ని కేసులను మూసివేసేలా చూస్తామని చెప్పారు. తనపై ఉన్న కేసులన్నీ అబద్ధాలేనని నొక్కి చెప్పిన ఆయన కాషాయపార్టీకి సవాల్ విసిరారు. తాను మహారాణా ప్రతాప్ వారసుడినని, రాజపుత్రుడినని చెప్పారు. తల నరుక్కోవడానికి అయినా సిద్ధంగా ఉంటాను కానీ కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎప్పటికీ మోకరిల్లలేనని చెప్పారు. తనపై ఉన్న కేసులన్నీ అవాస్తవాలే అని ఆయన ట్వీట్ చేశారు.
ధర్మం కోసం చావడానికైనా సిద్దమే: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
అయితే సిసోడియా వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి అందరి దృష్టి మరల్చడానికి ఢిల్లీ డిప్యూటీ సీఎం ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకుడు మనోజ్ తివారీ అన్నారు. తమ పార్టీ నుంచి ఆఫర్లు ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పాలని కోరారు. సీబీఐ రైడ్ జరిగినప్పుడు అధికారులు ఫోన్ స్వాధీనం చేసుకున్నారని, మని అలాంటప్పుడు ఆయనకు మెసెజ్ ఎలా వచ్చిందని, దానిని ఎలా చదివారని ప్రశ్నించారు. దర్యాప్తు కోసం మెసేజ్ వచ్చిన ఫోన్ అధికారులకు అప్పజెప్పాలని తివారీ డిమాండ్ చేశారు.