Aditya L1: శనివారం ఫైనల్ ఆర్బిట్లోకి ఆదిత్య ఎల్1.. సూర్యుడి రహస్యాలను అన్వేషించే ఇస్రో మిషన్
ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ శనివారం దాని చిట్టచివరి కక్ష్యలోకి చేరనుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు ఈ అద్భుతం జరగనుంది. సూర్యుడి రహస్యాలను అన్వేషించడానికి ఇస్రో పంపిన తొట్టతొలి సోలార్ మిషన్ ఇది.
![isro solar mission adiya l1 to enter final orbit to reach lagrange point 1 of halo orbit to research sun kms isro solar mission adiya l1 to enter final orbit to reach lagrange point 1 of halo orbit to research sun kms](https://static-ai.asianetnews.com/images/01hbk5vwc8tqxz67r7z29x816v/whatsapp-image-2023-09-30-at-7-22-25-pm_363x203xt.jpg)
ISRO: శనివారం సాయంత్రం 4 గంటలకు ఖగోళంలో అద్భుతం జరగనుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 తుది అంకానికి చేరుకోనుంది. ఫైనల్ ఆర్బిట్లోకి రేపు చేరనుంది. భారత్ ప్రయోగించిన తొలి సోలార్ మిషన్ ఇది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరం(సూర్యుడు, భూమికి మధ్య గల దూరంలో ఒక శాతం దూరం)లో ఆదిత్య ఎల్1 లాగ్రేంజ్ పాయింట్ 1లోకి చేరి సూర్యుడిని అధ్యయనం చేయనుంది.
లాంగ్రేంజ్ పాయింట్ 1 అంటే ఏమిటీ?
ఆదిత్య ఎల్ 1 సూర్యుడు-భూమి మధ్యనున్న లాగ్రేంజ్ పాయింట్ 1లోకి చేరునుంది. ఈ లాగ్రేంజ్ పాయింట్లను 18వ శతాబ్దంలో తొలిసారి పరిశోధించిన ఫ్రెంచ్ మ్యాథమేటిషియన్ జోసెఫ్ లూయిస్ లాగ్రేంజ్ గౌరవంగా వీటికి ఆ పేరు వచ్చింది.
రెండు భారీ ఖగోల వస్తువుల మధ్య ఉభయ గురుత్వాకర్షణ శక్తులు శూన్యం అయిపోయే స్థితి ఒకటి ఉంటుంది. ఉభయ వస్తువుల గురుత్వాకర్షణల ప్రభావం లేని, లేదా ఆ రెండు గురుత్వాకర్షణలు సంతులనం చెందిన ప్రాంతాన్ని లాగ్రేంట్ పాయింట్ అంటారు. ఇక్కడికే ఆదిత్య ఎల్1 చేరుతుంది. భూమికి, సూర్యుడికి మధ్య ఇలాంటి ఐదు పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్ వద్దకు వ్యోమనౌక చేరితే.. అక్కడ దాని ఇంధన వినియోగం అత్యల్పంగా ఉంటుంది.
Also Read: Aditya-L1: భూగ్రహ ప్రభావం నుంచి బయటకు.. సూర్యుడి వైపు ఆదిత్య ఎల్1 ప్రయాణం: ఇస్రో
ఈ లాగ్రేంజ్ పాయింట్ వద్దకు ఒక స్పేస్క్రాఫ్ట్ను పంపడం భారత్కు ఇదే తొలిసారి. అయితే, అమెరికా ఇది వరకే పంపించింది. ఆ తర్వాత మన దేశమే పంపుతున్నది. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ ప్రయోగం చేశాయి.
ఆదిత్య ఎల్ 1 లక్ష్యాలు:
సూర్యుడి ఉపరితల ఆవరణాలను పరిశీలించడం, క్రోమోస్ఫెరిక్, కరోనాల్ ఎజెక్షన్లను పరిశీలించడం. పాక్షికంగా అయనీకరణ చెందిన ప్లాస్మా భౌతిక స్థితిని పరిశీలించడం, సోలార్ కరోనా, వేడిమి కలిగించే వ్యవస్థను అబ్జర్వ్ చేయడం, సూర్యుడి, ఆ నక్షత్రానికి సంబంధించిన అణువులు, పరమాణులను, అక్కడి పరిణామాలు, ఇతర అంతుచిక్కని విషయాలనూ ఈ ఆదిత్య ఎల్ మిషన్ ద్వారా ఇస్రో తెలుసుకోనుంది. అంతిమంగా ఇవి విశ్వం పుట్టుక, ఖగోళం గురించిన ఇతర ఆసక్తికర విషయాలను తెలుసుకోడంలో దోహదపడనున్నాయి.
Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి
టైమ్లైన్:
గతేడాది సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 మిషన్ను శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ప్రయోగించింది. సెప్టెంబర్ 3న భూమి చుట్టూ ఈ మిషన్ నాలుగు రౌండ్లు వేసింది. 18వ తేదీన సైంటిఫిక్ డేటాను సేకరించడం ప్రారంభించింది. 19వ తేదీన ఎల్ 1 పాయింట్ వైపుగా ప్రయాణం ప్రారంభించింది. సెప్టెంబర్ 30వ తేదీన భూగ్రహ ప్రభావం నుంచి తప్పించుకుంది. డిసెంబర్ 1వ తేదీన సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికిల్ ఎక్స్పెరిమెంట్ పేలోడ్లు పని చేయడం ప్రారంభించాయి. డిసెంబర్ 18వ తేదీన ఎస్యూఐటీ పేలోడ్ సూర్యుడి ఫుల్ డిస్క్ ఇమేజ్లు తీయడం మొదలు పెట్టింది. జనవరి 6వ తేదీన దాని ఫైనల్ ఆర్బిట్లోకి ప్రవేశించనుంది.