నమీబియా టు ఇండియా.. ప్రత్యేక కార్గో విమానంలో వచ్చిన విశిష్ట అతిథులు.. చిరుతల తరలింపు వీడియో వైరల్
నమీబియా నుంచి వచ్చిన చిరుతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు. ఫలింగా మొత్తం 8 చిరుతలు దేశానికి చేరాయి. అయితే.. ఈ చిరుతల తరలింపునకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది
మనదేశంలో అంతరించిపోయిన చిరుతలు ఏడు దశాబ్దాల తర్వాత.. తిరిగి భారత భూభాగంపై అడుగుపెట్టాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా శనివారం మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కులో 8 చిరుతలను విడుదల చేశారు. ఇందులో మూడు మగ చిరుతలు, 5 ఆడ చిరుతలు ఉన్నాయి. 'ప్రాజెక్ట్ చీతా'లో భాగంగా.. మన ప్రభుత్వం వీటిని ఆఫ్రికాలోని నమీబియా ప్రాంతం నుంచి దేశానికి తీసుకొచ్చింది.
చిరుతలను ఆఫ్రికాలోని నమీబియా నుండి ప్రత్యేక కార్గో విమానం(బోయింగ్ 747)లో తీసుకువచ్చారు. ఇలా తీసుకరావడం.. ఇది ప్రపంచంలోనే తొలి సారి. దీంతో ఇంటర్-కాంటినెంటల్ చిరుత ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ చిరుతలను బోయింగ్ ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. ఇందుకోసం విమానంలో ప్రత్యేక సన్నాహాలు చేశారు. అదే సమయంలో నమీబియా నుండి ఈ చిరుతలను తీసుకురావడానికి విమానంలో ఎలాంటి ఏర్పాటు చేశారో చూపించే వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
బోయింగ్ ప్రత్యేక విమానంలో చిరుతలను తీసుకురావడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. ఆ వీడియోలో కనిపించే విధంగా చిరుతల నాలుగు పెట్టెలను ఒక చోట ఉంచగా, మరో నాలుగు పెట్టెలను మరో చోట ఉంచారు. వాటి కోసం ప్రత్యేక లాగ్ బాక్స్ లను ప్రత్యేకంగా రూపొందించారు. ఆ పెట్టెలకు చాలా రంధ్రాలు ఉన్నాయి. తద్వారా చిరుతలకు శ్వాస తీసుకోవడంలో ఎటువంటి సమస్య ఉండదు. ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చిరుతల తరలింపు జరిగింది.
నమీబియా నుండి 8 చిరుతలను మోస్తున్న బోయింగ్ ప్రత్యేక విమానం ఉదయం 7 గంటలకు గ్వాలియర్లోని మహారాజ్పురా ఎయిర్బేస్కు చేరుకున్నాయి. అక్కడ నుంచి చినూక్ హెలికాప్టర్ ద్వారా ఈ చిరుతలను కునో నేషనల్ పార్క్కు తరలించారు. వీటిలో మూడు చిరుతలను ప్రధాని మోదీ భారతదేశంలోని తన కొత్త నివాసమైన కునో నేషనల్ పార్క్లోని ప్రత్యేక ఎన్క్లోజర్లలో విడుదల చేయగా, మిగిలిన ఐదు చిరుతలను ఇతర నాయకులు విడుదల చేశారు.
వాటిని బోనుల నుండి ప్రత్యేక ఎన్క్లోజర్లోకి విడిచిపెట్టడానికి, సుమారు 10 అడుగుల ఎత్తులో ఓ ప్లాట్ఫారమ్ ను తయారు చేశారు, అక్కడ నుండి మోడీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో.. మీటను నొక్కి చిరుతలను బోను నుండి విడుదల చేశారు.