IndiGo flight faces hailstorm: ఇండిగో విమానం శ్రీనగర్లో తుఫానులో చిక్కుకుంది. వడగళ్ల వానతో విమానం కుదుపునకు గురైంది. అలాగే, ముందుభాగం కూడా ధ్వంసమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
IndiGo flight faces hailstorm: ఢిల్లీ నుండి శ్రీనగర్ వెళ్లుతున్న ఇండిగో విమానం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. వడగళ్ల వాన దెబ్బకు విమానం ధ్వంసం కావడంతో పాటు కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, తీవ్ర వాతావరణ ప్రతికూలతలకు గురై అత్యవసరంగా శ్రీనగర్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానం శ్రీనగర్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్నపుడు భారీ మోస్తరు గాలులతో కూడిన ఉరుములతో వర్షం మొదలైంది. వడగళ్లు పడటంతో విమానానికి ముందు భాగమైన ‘నోస్ కోన్’ (nose cone) ధ్వంసమైంది.
విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో భారీ వర్షం విమానాన్ని తాకుతూ ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విమానం లోపల కుదుపులు తీవ్రమవుతుండగా, కొంతమంది ప్రయాణికులు భయంతో అరుస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.
వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రతికూలంగా ఉండటంతో పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ను సంప్రదించి అత్యవసర స్థితిని ప్రకటించాడు. అనంతరం శ్రీనగర్ విమానాశ్రయంలో సాయంత్రం 6.30 గంటలకు విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ల్యాండింగ్ అనంతరం విమానంలోని ప్రయాణికులందరూ, సిబ్బంది సురక్షితంగా విమానం నుంచి దింపారు. ఇండిగో సంస్థ దీనిని “ఎయిర్క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్” (Aircraft on Ground - AOG)గా ప్రకటించింది. అంటే, మరమ్మత్తులు పూర్తయ్యేంత వరకు ఆ విమానం ఇక ప్రయాణానికి అనర్హమని అర్థం. ఎందుకంటే ఆ విమానం చాలా వరకు ధ్వంసం అయింది.
విమానం ఏ మేరకు దెబ్బతిన్నదని పరిశీలించేందుకు ఇండిగో అధికారులు, భద్రతా విభాగాలు ముమ్మర పరిశీలనలు చేపట్టారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడం ఊపిరిపీల్చుకునే విషయం కాగా, విమానయాన సంస్థల భద్రత ప్రమాణాలపై మరోసారి చర్చలు చెలరేగుతున్నాయి.
ఇండిగో సంస్థ ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, సమయోచితంగా పైలట్ తీసుకున్న నిర్ణయం వలన ప్రయాణికుల ప్రాణాలు కాపాడగలిగినట్లు విమానయాన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.