భారత్లో లెక్కలోకి రాని కరోనా మరణాలు 49 లక్షలు.. అమెరికా సంస్థ సంచలన నివేదిక
భారత్లో కరోనా మరణాలపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవ పరిస్ధితులకు తేడా వుందని అమెరికాలోని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్ మెంట్ పేర్కొంది. దేశంలో దాదాపు 49 లక్షల మరణాలు లెక్కలోకి రాలేదని తెలిపింది
దేశంలో కరోనా మహమ్మారి సమయంలో లక్షలాది లెక్కలోకి రాని మరణాలు నమోదయ్యాయని ఓ సంచలన అధ్యయనం వెలుగులోకి వచ్చింది. దాదాపు 49 లక్షల మరణాలు లెక్కలోకి రాలేదని అమెరికాలోని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్ మెంట్ పేర్కొంది. మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం నేతృత్వంలోని బృందం.. ఈ అధ్యయనం నిర్వహించింది. కోవిడ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని రకాల మరణాలపై ఈ బృందం విశ్లేషించింది.
ప్రస్తుతం దేశంలో నమోదైన కరోనా మరణాలపై ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని సర్వే బృందం సూచించింది. సెకండ్ వేవ్ లో ఒక్క మే నెలలోనే 1.7 లక్షల మంది చనిపోయారని పేర్కొంది. కరోనా మహమ్మారి సమయంలో 34 లక్షల నుంచి 49 లక్షల వరకు అదనపు మరణాలు నమోదై ఉంటాయని అభియప్రాయపడింది. అయితే, అవన్నీ కూడా కరోనా మహమ్మారి వల్లే సంభవించినవని చెప్పలేమని, దానికి ఎన్నో కారణాలూ ఉండి ఉంటాయని వెల్లడించింది.
Also Read:ఇండియాలో ఒక్క రోజులోనే 40 శాతం పెరుగుదల: రికవరీ కంటే కరోనా కొత్త కేసులే ఎక్కువ
అయితే ఈ నివేదికపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అయితే, ప్రతి దేశమూ లెక్కలోకి రాని మరణాలపై ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ స్పష్టం చేశారు. భవిష్యత్ లో వచ్చే మరిన్ని ముప్పులను ఎదుర్కొనేందుకు అదొక్కటే పరిష్కారమని ఆమె సూచించారు.