ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు ప్రెసిడెంట్ కలర్.. అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు ప్రెసిడెంట్ కలర్ అందించారు. ఈ రోజు కొచ్చిలో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఉన్నతమైన గుర్తింపు ప్రెసిడెంట్ కలర్ను ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు అందించారు.
కొచ్చి: ఇండియన్ నేవీ గన్నరీ స్కూల్ ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్స్ కలర్ లేదా నిషాన్ను అందించారు. ఈ రోజు కొచ్చిలోని ఐఎన్ఎస్ ద్రోణాచార్యలో జరిగిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ నిషాన్ను అందించారు. ఈ సందర్భంగా ఆమె భారత నావికా దళం గురించి మాట్లాడారు.
భారత వ్యూహాత్మక బలాల్లో భారత నావికా దళం ఇప్పటికీ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మిలిటరీ, ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలను కాపాడటానికి ఇండియన్ నేవీ కీలకంగా ఉన్నదని వివరించారు. సుదీర్ఘ సముద్ర తీర రేఖ కలిగి, దీవుల సముదాయాలనూ కలిగి ఉన్న భారత్ వంటి దేశానికి ఆధునిక, శక్తిమంతమైన నావికా దళం ఎంతో అవసరం అని తెలిపారు.
75 ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో ప్రత్యర్థుల నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడమే కాదు.. దేశంలో సామాజిక, ఆర్థిక పురోగతికి దోహదపడింది కూడా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరించారు. సముద్ర జలాల సరిహద్దులు, వాణిజ్య రవాణా మార్గాలను కాపాడటం, విపత్తులో సమయంలో సహాయం చేసే ఇండియన్ నేవీ పట్ల భారత దేశం గర్విస్తుందని చెప్పారు.
Also Read: తెలంగాణలో హఠాత్తుగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. చర్యలు తీసుకోండి: ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ఇండియన్ నేవీ ఎన్నో రూపాల్లో వృద్ధి సాధించిందని, సామర్థ్యాలను పెంచుకున్నదని ఆమె తెలిపారు. ఎలాంటి అపాయాల్లోనైనా ముందస్తుగా స్పందించేది ఇండియన్ నేవీ అని చెప్పారు.