భారత నావికాదళం మంగళవారం రోజున యుద్ధనౌక నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (ఎంఆర్ఎస్ఏఎం)ను విజయవంతంగా పరీక్షించింది.
భారత నావికాదళం చేపట్టిన మీడియం రేంజ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. భారత నావికాదళం మంగళవారం రోజున యుద్ధనౌక నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (ఎంఆర్ఎస్ఏఎం)ను విజయవంతంగా పరీక్షించింది. ఎంఆర్ఎస్ఏఎం క్షిపణులకు యాంటీ షిప్ మిస్సైళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నట్లుగా నేవీ తెలిపింది. 70 కి.మీ పరిధిలో శత్రు విమానాలు, హెలికాప్టర్లు క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను నాశనం చేయడానికి ఎంఆర్ఎస్ఏఎం రూపొందించబడింది. ఆత్మనిర్భర భారత్లో భాగంగా భారత నౌకాదళం ఈ మిస్సైల్ను రూపొందించింది.
ఎంఆర్ఎస్ఏఎంను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఆత్మనిర్భర్ భారత్ పట్ల నేవీ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తూ భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో ఉత్పత్తి చేయబడింది. ఇందుకు సంబంధించిన వివరాలను భారత నేవీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం విధ్వంసక యుద్ధనౌక బ్రహ్మోస్ ప్రెసిషన్ స్ట్రైక్ క్షిపణిని భారత నావికాదళం విజయవంతంగా ప్రయోగించింది. ఆదివారం నాడు అరేబియా సముద్రంలో బ్రహ్మోస్ క్షిపణి పరీక్షను నిర్వహించింది. అరేబియా సముద్రంలో కచ్చితమైన దాడిని విజయవంతంగా నిర్వహించిందని నేవీ అధికారులు తెలిపారు.
బ్రహ్మోస్ క్షిపణిని కోల్కతా-క్లాస్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ నుండి పరీక్షించారు. బంగాళాఖాతంలోని 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌకపై లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా చేధించినట్టు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది.బ్రహ్మోస్ ఏరోస్పేస్ క్షిపణిలో స్వదేశీ కంటెంట్ను పెంచడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఆత్మనిర్బర్ భారత్ నిర్మాణంలో భాగంగా ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని ఇండియన్ నేవీ ప్రకటించింది.
