భారత నావికా దళ కొత్త జెండాలో ఛత్రపతి స్ఫూర్తి.. శివాజీ రాజముద్ర రూపం స్వీకరణ.. నూతన పతాకం విశేషాలివే..!
భారత నావికా దళం కొత్త జెండాను స్వీకరించింది. ఈ జెండాను శుక్రవారం ప్రధాని మోడీ ఆవిష్కరించారు. నూతన పతాకంలో ఛత్రపతి శివాజీ రాజముద్ర నుంచి స్ఫూర్తి తీసుకున్నారు. ఇప్పటి వరకు నావికా దళ జెండాలో బానిసత్వ చిహ్నాలు ఉన్నాయని, ఇకపై నుంచి అవి ఉండబోవని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. నూతన పతాకం గురించిన విశేషాలు తెలుసుకుందాం.
న్యూఢిల్లీ: భారత నావికా దళంలోకి కొత్త విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రవేశపెట్టారు. ప్రధాని మోడీ శుక్రవారం ఐఎన్ఎస్ విక్రాంత్ను నావికా దళానికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు భారత నావికా దళ పతాకంలో బానిసత్వ అవశేషాలు ఉన్నాయని, ఇక పై అది ఉండదని వివరంచారు. ఎందుకంటే..నావికా దళం కొత్త పతాకంలో ఛత్రపతి శివాజీ రాజముద్రలోని రూపాన్ని స్వీకరించామని, విదేశీయులు వదిలిపెట్టిన ఆకారాలను పతాకం నుంచి తొలగించామని వెల్లడించారు. ఆయన నావికా దళం కొత్త పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం, భారత నావికా దళం ఓ వీడియోను ట్వీట్ చేసింది. అందులో పతాకానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని పొందుపరిచింది. ఇప్పటి వరకు ఉన్న నావికా దళం పతాకంలో సెయింట్ జార్జీ క్రాస్ ఉండేది. దాన్ని తాజాగా తొలగించారు. జాతీయ పతాకం ఎప్పటిలాగే ఉంది. అయితే, కుడి వైపున అష్టభూజి ఆకారంలో సింబల్ ఉన్నది. సింబల్ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఉన్నది. ఇందులో ఓ యాంకర్ (లంగరు) ఉన్నది. ఇది భారత నావికా దళం దృఢత్వం, సామర్థ్యాన్ని సూచిస్తున్నది.
ఈ యాంకర్ కింద వేదాల్లో నుంచి తీసుకున్న ఓ కొటేషన్ ఉన్నది. సం నో వరుణ: అని రాసి ఉంది. అంటే.. వరుణ దేవుడు తమ పట్ల దయ ఉంచి విజయాన్ని ప్రసాదించాలని కోరడం ఆ వ్యాఖ్య అర్థం అని తెలుస్తున్నది.
ఈ వీటిని లోపలే ఉంచుతూ చుట్టూ అష్టభుజిలో రెండు రింగ్లు ఉన్నాయి. ఈ ఆకారం శివాజీ రాజముద్రలో నుంచి తీసుకుంది. ఈ ఎనిమిది భుజాలు ఎనిమిది దిక్కులను సూచిస్తున్నాయి. అంటే, భారత నావికా దళం ఏ దిక్కులోనైనా సమర్థంగా ముందుకు వెళ్లగలదని, దాని సామర్థ్యాన్ని చూపించుకోగలదని తెలుపుతున్నదని ఆ వీడియో పేర్కొంది.
ఛత్రపతి శివాజీ దగ్గర 60 యుద్ధ నౌకలు ఉండేవని, తీర ప్రాంతాన్ని రక్షించిన తొలి నావికా దళం ఇదేనని ఆ వీడియో వివరించింది. తీర ప్రాంతాన్ని విదేశీయుల నుంచి కాపాడిన తొలి పాలకుడు ఛత్రపతి శివాజీనే అని పేర్కొంది.