Modi US Visit: ప్రధానమంత్రికి ప్రవాస భారతీయుల నుంచి అదిరిపోయే స్వాగతం.. ఫొటోలు షేర్ చేసిన మోడీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికాలో ఆత్మీయ స్వాగతం లభించింది. ప్రధాన మంత్రి అమెరికాలో ఎయిర్పోర్టులో ల్యాండ్ కాగానే పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు చుట్టూ చేరి ఘనంగా స్వాగతించారు. ప్రపంచంలో భారత ప్రవాసులు విశిష్టమైనవారని, వారే తమ బలమని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆ ఫొటోలనూ షేర్ చేసుకున్నారు.
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)కి అమెరికా(America)లో ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు(Indian americans) పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. స్వయంగా వచ్చి ప్రధాని మోడీని స్వాగతించారు(Warm welcome). గురువారం తెల్లవారుజామునే ఆండ్రూస్ జాయింట్ ఎయిర్ఫోర్స్ బేస్కు ఇండియన్ అమెరికన్లు భారీగా వచ్చారు. ప్రధాని మోడీ ల్యాండ్ అవ్వగానే చుట్టూ చేరి స్వాగతించారు. మహిళలు భారత సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా చీరలు కట్టుకుని వచ్చి మరీ ఆయనకు నమస్కరించారు. ఇండియన్ అమెరికన్ సీఈవోలు ఆయనతో ప్రత్యేకంగా చర్చించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ స్వాగతానికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. వాషింగ్టన్ డీసీలో భారత ప్రవాసీయులు ఆత్మీయ స్వాగతాన్ని అందించారని పేర్కొన్నారు. ‘మన ప్రవాసులు మా బలం. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రవాసీయులు విశిష్టమైనవారు’ అని ట్వీట్ చేశారు.
భారత ప్రవాస సీఈవోలతో ప్రధాని మోడీ అక్కడే బారికేడ్లకు అటువైపుగా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడినట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వివరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని భారత కమ్యూనిటీల్లో విశేష ఆదరణ ఉన్నది. ముఖ్యంగా అమెరికాలో ఇది మరీ ఎక్కువ. దేశ జనాభాలోని 1.2 శాతం జనాభా అమెరికాలోనే ఉన్నది. వీరు అమెరికా రాజకీయాల్లోనూ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ప్రధాని మోడీ అమెరికాకు పర్యటించిన ప్రతిసారి దాదాపు ప్రవాస భారతీయులతో సమావేశమవుతుంటారు. లేదా వారితో ప్రత్యేకంగా సభ నిర్వహిస్తుంటారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి మోడీ ఏడుసార్లు అమెరికాకు పర్యటించారు.