పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యాధిపతికి అదనపు అధికారాలను కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
India Pakistan War : పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను భారతదేశం ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఇందులో 100 కి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే తమ భూభాగంలో వచ్చి ఉగ్రవాదులపై దాడిచేసిన భారత్ పై పాక్ ప్రతిదాడులకు దిగింది. గురువారం సాయంత్రం నుండి మిస్సైల్స్, డ్రోన్లతో సరిహద్దు ప్రాంతాల్లో నగరాలు, సైనిక స్థావరాలపై దాడులకు పాక్ ప్రయత్నించగా భారత్ వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టింది.
భారత త్రివిధ దళాలతో రాజ్నాథ్ సింగ్ సంప్రదింపులు
భారత సైన్యం కూడా పాకిస్తాన్కు తగిన కౌంటర్ ఎటాక్ చేసింది. పాకిస్తాన్లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ సౌత్ బ్లాక్లో భారతదేశ ప్రస్తుత భద్రతా పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, రక్షణ కార్యదర్శి ఆర్.కె. సింగ్ వంటి సైనిక ఉన్నతాధికారులు మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీతో రాజ్నాథ్ సింగ్ భేటీ
పాకిస్తాన్ నిరంతరం ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో భారతదేశం తదుపరి ఏమి చేయాలి? ఇప్పటివరకు పాకిస్తాన్పై భారతదేశం ఏ చర్యలు తీసుకుంది? అనే దానిపై చర్చలు జరిగాయి. తమ దళాల ప్రతిస్పందన గురించి త్రివిధ దళాల అధిపతులు రాజ్నాథ్ సింగ్కు వివరించారు. ఈ సమావేశం తర్వాత రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీని కలిసి మాట్లాడారు.
సైన్యాధిపతికి అదనపు అధికారాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
దీని తర్వాత సైన్యాధిపతికి అదనపు అధికారాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలను కలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుండి ఈ ప్రకటన వచ్చింది. ఈ అధికారం ద్వారా పార్ట్ టైమ్ వాలంటీర్లతో కూడిన సైన్యాన్ని సైన్యాధిపతి నడిపించవచ్చు. అంతేకాకుండా దేశంలోని ఇతర విధుల్లో ఉన్న వివిధ విభాగాలకు చెందిన సైనికులను వెంటనే యుద్ధభూమికి పిలిచే పనిని సైన్యాధిపతి చేపట్టాలని ఆదేశించారు.