భారత సైనికుల కోసం ఆరోగ్యకరమైన, రుచికరమైన , పోషకమైన మిల్లెట్ వంటకాలను సిద్ధం చేయడానికి చెఫ్లకు శిక్షణను ఇవ్వడం ప్రారంభించినట్లు రక్షణ శాఖ తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తృణ ధాన్యాలకు అమిత ప్రాధాన్యతను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ పంటలను వేసే రైతులను ప్రోత్సహించడంతో పాటు వీటితో చేసే వంటకాలను కూడా ప్రమోట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 నుంచి సైనికుల రేషన్లో 25 శాతం తృణధాన్యాల పిండిని వుంచాలని సూచించింది. దీనిని క్యాంటీన్లు, ఇంటి వంటలలో విస్తృతంగా వినియోగించాలని రక్షణ శాఖ అడ్వైజరీని జారీ చేసింది. అంతేకాకుండా సైనికుల కోసం ఆరోగ్యకరమైన, రుచికరమైన , పోషకమైన మిల్లెట్ వంటకాలను సిద్ధం చేయడానికి చెఫ్లకు శిక్షణను ఇవ్వడం ప్రారంభించినట్లు రక్షణ శాఖ తెలిపింది.
అన్ని శ్రేణుల సైనికులకు రోజువారీ భోజనంలో మిల్లెట్ చేర్చాలనే నిర్ణయం వల్ల వ్యాధుల బారినపడటం తగ్గుతుందని సైన్యం పేర్కొంది. సూపర్ఫుడ్గా నిపుణులు చెబుతున్న దీనిపై ప్రభుత్వం సైతం చొరవ తీసుకోవడంతో పాటు ఈ ఏడాదిని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించింది. షాపింగ్ కాంప్లెక్స్లలో సైతం మిల్లెట్పై అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్నర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా విద్యా సంస్థల్లో ‘Know your millet’ పేరిట క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నారు.
ఇదిలావుండగా.. ప్రపంచ ఆహార సంక్షోభానికి చిరు ధాన్యాలు పరిష్కారం కాగలవని గత శనివారం జరిగిన శ్రీఅన్న సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ అన్నారు. కొన్ని రాష్ట్రాలు కూడా ప్రజా పంపిణీ పథకంలో చిరుధాన్యాలను చేర్చాయని ఆయన తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడవాలని ప్రధాని కోరారు. అంతేకాకుండా చిన్న, సన్నకారు రైతులకు అవి సిరులు కురిపించగలవని ప్రధాని పేర్కొన్నారు.
