గోధుమలు దిగుమతి చేసుకునే ప్లాన్స్ లేవు: కేంద్రం స్పష్టీకరణ
మన దేశం గోధుమలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. కానీ, ఆ అంచనాలను తప్పుడుతూ కేంద్ర ప్రభుత్వం అలాంటి అవసరం లేదని స్పష్టం చేసింది. దేశ అవసరాలకు సరిపడా గోధుమ నిల్వలు ఉన్నాయని వెల్లడించింది.
న్యూఢిల్లీ: దేశంలో గోధుమల కొరత ఏర్పడవచ్చని ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్బర్గ్ ఓ కథనం ప్రచురించింది. ఉత్పత్తి తగ్గడం, ధరల పెరుగుదల, వడగాలుల కారణంగా ఈ సారి గోధుమల కొరత ఏర్పడవచ్చని కథనం రాసింది. ఫలితంగా దేశం గోధుమలను దిగుమతి చేసుకోక తప్పదనే విధంగా ఆ కథనం ఉన్నది. ఈ కథనం చర్చను లేవదీసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ కథనాన్ని ఖండించింది. గోధుమలను దిగుమతి చేసుకోవాలనే ప్రణాళికలు ఏమీ లేవని ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. దేశ అవసరాలకు సరిపడా గోధుమ నిల్వలు ఉన్నాయని వివరించింది. ప్రజా పంపిణీకి సరిపడా గోధుమలు ఫుడ్ కార్పొరేషనర్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయని తెలిపింది.
గోధుమలు కొరత ఏర్పడే అవకాశం ఉన్నదనే అంశంపై స్పందించాలని కోరగా కేంద్ర ఆర్థిక శాఖ కామెంట్ చేయలేదని బ్లూమ్ బర్గ్ పేర్కొంది. ఫుడ్, కామర్స్ మినిస్ట్రీస్ ప్రతినిధి కూడా ఈ అంశంపై స్పందించలేదని వివరించింది.
ఇతర అంచనాదారులు, వ్యాపారులు ఈ ఏడాది గోధుమ ఉత్పత్తి అంచనాలను వడగాలుల కారణంగా తగ్గించుకోగా.. భారత్ మాత్రం బుధవారం అనూహ్యంగా పెంచేసింది.. గోధుమల ఉత్పత్తిని గత ఏడాది 129.66 మిలియన్ల టన్నులు ఉండగా.. దాన్ని 2021- 22 ఏడాదికి 130.29 మిలియన్ టన్నులకు పెంచింది.
ట్రేడర్లు ఈ అంచనాను 95 మిలియన్లకు తగ్గించగా.. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్స్ ఫారీన్ అగ్రికల్చరల్ సర్వీసెస్ దీన్ని 99 మిలియన్ల టన్నులుగా అంచనా కట్టింది.