పాకిస్థాన్తో భారత్ సాధారణ సంబంధాలను కోరుకుంటుంది, అయితే.. : విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు
Kashmir issue: కజకిస్థాన్ లో జరిగిన 6వ సీఐసీఏ శిఖరాగ్ర సమావేశంలో పాకిస్థాన్.. జమ్మూకాశ్మీర్ అంశాలను లేవనెత్తింది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది.
India-Pakistan relations: భారత్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలకు ఆశ్రయమిస్తున్న పాకిస్థాన్.. అంతర్జాతీయ సమావేశాలు జరిగినప్పుడల్లా భారత్ పై విషంకక్కుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరోసారి ఓ అంతర్జాతీయ సమావేశంలో జమ్మూకాశ్మీర్ అంశాలను లేవనెత్తింది. అయితే, పాక్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన భారత ప్రతినిధులు.. ఘాటుగానే స్పందించారు. తాజాగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. పాకిస్థాన్ తో భారత్ సాధారణ సంబంధాలను కోరుకుంటున్నదని పేర్కొంది.
వివరాల్లోకెళ్తే.. కజకిస్థాన్లోని అస్తానాలో జరిగిన కాన్ఫరెన్స్ ఆన్ ఇంటరాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ (CICA) సమ్మిట్లో పాకిస్థాన్ మరోసారి జమ్మూకాశ్మీర్ అంశాలను గురించి లేవనెత్తింది. భారత్ పై మరోసారి తప్పుడు ఆరోపణలు చేసింది. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై లేవనెత్తుతున్న పాకిస్థాన్పై విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి విమర్శలు గుప్పించారు. దాని సొంత భూభాగాల్లోనే మైనారిటీలను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలతో పాకిస్థాన్ కు కౌంటరిచ్చారు.
ఈ క్రమంలోనే CICA సమ్మిట్లో పాకిస్తాన్ లేవనెత్తిన జమ్మూ కాశ్మీర్ అంశంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, పాకిస్తాన్తో సాధారణ సంబంధాలను భారత్ కోరుకుంటున్నదని చెప్పారు. తాము ఇది కొత్తగా చెబుతున్న విషయం కాదనీ, చాలా కాలం నుంచి తాము ఇదే విషయం గురించి చెబుతున్నామని చెప్పారు. అయితే, ఇది ఉగ్రవాదం లేని, అనుకూలమైన, శాంతియుత వాతావరణంలో ఉండాలని అన్నారు. 'పాకిస్థాన్ తో సాధారణ సంబంధాలను మేము కోరుకుంటున్నాం, ఇది మేము ఎప్పుడూ చెప్పే విషయమే. కానీ ఇది అనుకూలమైన, ఉగ్రవాదం లేని వాతావరణంలో ఉండాలి" అని అరిందమ్ బాగ్చి అన్నారు.
సీఐసీఏ సమ్మిట్ లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్
కజకిస్థానల్ వేదికగా జరుగుతున్న 6వ సీఐసీఏ సదస్సులో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కాశ్మీర్లోని ప్రజలపై భారత ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని ఆరోపించారు. షాబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో భారత్తో చర్చలకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. కానీ, అర్థవంతమైన, ఫలితాల ఆధారిత కనెక్టివిటీ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత భారత్పైనే ఉందంటూ ఆయన చెప్పారు.
పాకిస్థాన్కు ధీటుగా సమాధానమిచ్చిన భారత్
పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే హక్కు పాకిస్థాన్కు లేదని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మీనాక్షి లేఖి అన్నారు. పాకిస్థాన్ ఇటీవలి వ్యాఖ్యలు భారతదేశ అంతర్గత వ్యవహారాలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలో స్థూలమైన జోక్యం అని మీనాక్షి లేఖి పేర్కొన్నారు.
భారత్-యూకేల మధ్య ఎఫ్టీఏ పై చర్చలు..
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) ఖరారు చేసేందుకు భారత్, బ్రిటన్ చర్చలు జరుపుతున్నాయనీ, చర్చను వాణిజ్య మంత్రులకే వదిలేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, "మేము ముందుగా చెప్పినట్లు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించడానికి ఇరుపక్షాలు ఆసక్తిగా ఉన్నాయి" అని చెప్పారు. అదే సమయంలో, బ్రిటిష్ మంత్రి బ్రేవర్మాన్ వ్యాఖ్యలపై ప్రతినిధి స్పందించలేదు. వాస్తవానికి, ఈ ఒప్పందం బ్రిటన్కు వలసలను పెంచుతుందనీ, బ్రెగ్జిట్ లక్ష్యాలకు విరుద్ధంగా ఉంటుందని ఇమ్మిగ్రేషన్పై చేసిన వ్యాఖ్యలలో బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రవర్మాన్ అన్నారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అత్యధిక సంఖ్యలో భారతీయులు యూకేలోనే ఉంటున్నారని బ్రేవర్మాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థినిపై దాడిని ప్రస్తావిస్తూ...
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిని పలుమార్లు కత్తితో పొడిచిన ఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. "ఈ సంఘటన మాకు తెలుసు. దాడికి గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాన్బెర్రాలోని మా హైకమిషన్-సిడ్నీలోని కాన్సులేట్ స్థానిక అధికారులతో టచ్లో ఉన్నాయి. అలాగే, బాధితుల కుటుంబంతో కూడా టచ్ లో ఉన్నాము" అని చెప్పారు. ఇది బాధాకరమైన విషయమని అన్నారు.