నేతాజీ జయంతి నుంచే గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం.. ఈ ఏడాది నుంచి అమలు
ఇక నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నుంచే గణతంత్ర దినోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది జనవరి 24 నుంచి గణతంత్ర వేడుకలు ప్రారంభం అవుతాయి. కానీ, ఈ సారి నేతాజీ జయంతి అయిన జనవరి 23వ తేదీ నుంచే ఈ వేడుకలు ప్రారంభం కానున్నట్టు కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నేతాజీ జయంతిని గణతంత్ర వేడుకల్లో అంతర్భాగం చేయనున్నారని పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలు(Republic day Celebrations) జనవరి 23వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. గత ఏడాది వరకు గణతంత్ర వేడుకలు జనవరి 24వ తేదీ నుంచి ప్రారంభం అయ్యేవి. కానీ, ఈ ఏడాది మొదలు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(Netaji Subhash Chandrabose Birth Anniversary) అంటే జనవరి 23వ తేదీ నుంచే ప్రారంభం కానున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. భారత దేశ చరిత్ర, సంస్కృతికి సంబంధించి ప్రధానమైన అంశాలను వేడుక చేసుకోవాలనే నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివస్గా వేడుక చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయంతో ఏ కార్యక్రమాలు నిర్వహించనుందనే విషయాలపై ఇప్పటికైతే స్పష్టత లేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చూడనుంది. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలక నేత. ఆయన ఒడిశాలోని కటక్లో 1897 జనవరి 23వ తేదీన జన్మించారు. ఈ ఏడాది ఆయన 125వ జయంతి వేడుకలు జరగనున్నాయి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివస్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితోపాటు ఆగస్టు 14ను విభజన కల్లోల దినంగా, అక్టోబర్ 31వ తేదీన జాతీయ ఐక్యతా దివస్(సర్దార్ వల్లభ్బాయ్ పటేల్ జయంతి)గా, నవంబర్ 15ను జన్ జాతీయ గౌరవ్ దివస్గా(బిర్సా ముండా జయంతి), నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా, డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్గా(గురు గోబింద్ సింగ్ నలుగురు కుమారులకు నివాళిగా) ప్రకటించిన సంగతి తెలిసిందే.
నేతాజీ బంధువు చంద్రబోస్ ప్రస్తుతం బీజేపీ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ, సుభాష్ చంద్రబోస్ నేటి 21వ శతాబ్దపు భారత దేశానికి సరిగ్గా సరిపోతాడని వివరించారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక పార్టీ అని కాదు.. అన్నీ పార్టీలు విభజిత రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. వీటిని వెంటనే ఆపేయాలని సూచించారు. నేతాజీ ఐక్య భారతావనిని కలగన్నాడని తెలిపారు. ఒక వేళ నేతాజీ భారత్కు తిరిగి వచ్చి ఉంటే.. భారత్ నుంచి ఇతర భాగాలు వేరుపడేవి కావని, పాకిస్తాన్, సహా బెంగాల్ కూడా భారత్లోనే ఉండేవని అభిప్రాయపడ్డారు. నేడు నేతాజీ భావజాలం భారత్కు చాలా అవసరం అని వివరించారు. లేదంటే.. భారత్ మరిన్ని సార్లు విడిపోగలదని హెచ్చరించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సమీపిస్తున్న తరుణంలో చంద్రబోస్.. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసినట్టు వివరించారు. కరెన్సీ నోట్లపై నేతాజీ చిత్రపటాలను వేయడం, జనవరి 23వ తేదీన నేషనల్ హాలీడేగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. అంతేకాదు, ఢిల్లీ గేటు ఎదురుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానితో డిమాండ్ చేసినట్టు తెలిపారు. ఎర్రకోటలో ఐఎన్ఏ మెమోరియల్ నిర్మించాలని పేర్కొన్నట్టు వివరించారు.