Pakistan violates ceasefire: కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ భారతదేశంతో కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లో మరోసారి దాడులకు పాల్పడటంతో పాకిస్తాన్ కు భారత్ వార్నింగ్ ఇచ్చింది.
India warns Pakistan over ceasefire violations at border: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సైనిక చర్యలను నిలిపివేయడానికి ఇద్దరు దేశాల డైరెక్టర్లు జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) మధ్య శనివారం సాయంత్రం ఓ అవగాహన కుదిరిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి తెలిపారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ తాజాగా ఉల్లంఘిస్తోందని తెలిపారు.
విదేశాంగ కార్యదర్శి మిశ్రి విలేకరులతో మాట్లాడుతూ.. "ఈ అక్రమ ప్రవేశం అత్యంత ఖండనీయం. దీనికి పాకిస్తానే బాధ్యత వహించాలి. ఈ పరిణామాన్ని పాకిస్తాన్ సరిగా అర్థం చేసుకోవాలని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం" అని అన్నారు.
అలాగే, భారత సైన్యానికి ఈ ఉల్లంఘనలకు గట్టి ప్రతిచర్య ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు మిశ్రి వెల్లడించారు. ఈ విషయంలో మన ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు పేర్కొన్నారు. "ఈ ఉదయం జరిగిన అవగాహనకు విరుద్ధంగా పాకిస్తాన్ సైన్యం ప్రవర్తిస్తోంది. భారత సైన్యం దీనికి సమర్థంగా స్పందిస్తోంది. సరిహద్దులో జరుగుతున్న ఈ దాడులను నిలిపివేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది" అని మిశ్రి స్పష్టం చేశారు.
ఇటువంటి ఉల్లంఘనలపై పాకిస్తాన్ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భారత ప్రభుత్వం ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తోందని, భద్రతా పరంగా దేశానికి భంగం కలిగే చర్యలను సహించబోదని ఆయన స్పష్టం చేశారు.
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనతో దాడులకు తెగబడిన ప్రాంతాలు:
1. ఉధంపూర్
2. అఖ్నూర్
3. నౌషెరా
4. పూంచ్
5. రాజౌరి
6. మెంధర్
7. జమ్మూ
8. సుందర్బాని
9. RS పురా
10. అర్నియా
11. కతువా