New Delhi: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరాను అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఖేరా అరెస్టును ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం, అసోం పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీ సర్కారు గుండాల గుంపులా వ్యవహరిస్తోందని విమర్శించింది.
Kharge slams Modi govt on Pawan Khera's arrest: దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో హైడ్రామా నడుమ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పవన్ ఖేరాను పోలీసులు అరెస్టు చేశారు .ఢిల్లీ నుంచి రాయ్పూర్కు వెళ్తున్న క్రమంలో ఇండిగో విమానం నుంచి ఆయనను బలవంతంగా కిందకు దింపేశారు. ఈ క్రమంలోనే అక్కడకు చేరుకున్న ఢిల్లీ పోలీసులు, అస్సాం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొంత సేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఖేరాను విమానం నుంచి కిందకు దింపడంతో కాంగ్రెస్ శ్రేణులు విమానాన్ని అడ్డుకున్నాయి. రన్వేపై కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆ పార్టీ సినియర్ నాయకులు రణదీప్ సూర్జేవాల, కేసీ వేణుగోపాల్ లు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ నియంతృత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.. : మల్లికార్జున్ ఖర్గే
కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాను అస్సాం పోలీసులు అరెస్టు చేయడం ద్వారా మోడీ సర్కారు భారత ప్రజాస్వామ్యాన్ని 'హిట్లర్షాహీ'గా మార్చిందని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. "ప్రతిపక్షాలు పార్లమెంటులో సమస్యలను లేవనెత్తితే నోటీసు ఇస్తారు. సదస్సుకు ముందు ఛత్తీస్ గఢ్ కు చెందిన మన నేతలపై ఈడీ దాడులు జరిపింది. ఈ రోజు కాంగ్రెస్ అధికార ప్రతినిధిని బలవంతంగా విమానం నుంచి కిందకు దింపి అరెస్టు చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం హిట్లర్ షాహీగా మార్చేసింది. ఈ నియంతృత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఖర్గే పేర్కొన్నారు.
ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలని..
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గూండాల గుంపులా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేసీ.వేణుగోపాల్ ఆరోపించారు. పవన్ ఖేరాను ఢిల్లీ-రాయ్ పూర్ ఫ్లైట్ నుంచి కిందకు దింపి అరెస్టు చేయడం ఏఐసిసి ప్లీనరీలో పాల్గొనకుండా అడ్డుకోవడానికేనని విమర్శించారు. "ఆయన కదలికను పరిమితం చేయడం, ప్రశ్నించే వారిని అణచివేయడానికి ప్రభుత్వం ఇలా ఎఫ్ఐఆర్ ను ఉపయోగించుకోవడం సిగ్గుమాలిన, ఆమోదయోగ్యం కాని చర్య అనీ, పార్టీ మొత్తం పవన్ వెంటే ఉంటుందని" తెలిపారు.