భారత్ తన తప్పులను సరిదిద్దుకుంటోంది.. చరిత్ర పుటల్లో నిలిచిన యోధులను స్మరించుకుంటోంది - ప్రధాని మోడీ
చరిత్ర పుటల్లో నిలిచిపోయిన యోధులను భారత్ నేడు స్మరించుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత బానిస చరిత్రను మార్చాల్సి ఉన్నా.. అది జరగలేదని చెప్పారు.
భారత్ తన వైవిధ్యమైన వారసత్వాన్ని జరుపుకోవడం ద్వారా తన గత తప్పులను సరిదిద్దుకుంటోందని ప్రదాని నరేంద్ర మోడీ అన్నారు. అంతగా గుర్తింపు దక్కని, చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ధైర్యవంతులను స్మరించుకుంటోందని అన్నారు. లచిత్ బర్ఫుకాన్ 400వ జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ ప్రసంగించారు. భారతదేశ చరిత్ర కేవలం బానిసత్వానికి సంబంధించినది కాదని, యోధుల చరిత్ర అని అన్నారు. భారత చరిత్రలో విజయం, త్యాగం, నిస్వార్థం, శౌర్యం ఉన్నాయని తెలిపారు.
ఆఫ్తాబ్ పాలిగ్రాఫ్ పరీక్షల్లో విస్తుపోయే వాస్తవాలు.. నేడూ కొనసాగనున్న టెస్టులు..
దురదృష్టవశాత్తూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా వలస పాలనలో కుట్రలో భాగంగా రచించిన చరిత్రే బోధించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బానిసత్వ ఎజెండాను స్వాతంత్య్రానంతరం మార్చాల్సిన అవసరం ఉందని, అయితే అది జరగలేదని తెలిపారు. దేశంలోని ప్రతీ మూలలో, వీర కుమారులు, కుమార్తెలు అణచివేతదారులతో పోరాడారని అన్నారు. అయితే ఈ చరిత్ర ఉద్దేశపూర్వకంగా అణచివేయబడిందని ఆయన అన్నారు.
నేడు భారతదేశం వలసవాద సంకెళ్లను తెంచుకుంటోందని, వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ. మన వీరులను సగర్వంగా స్మరించుకుంటూ ముందుకు సాగుతోందని అన్నారు. లచిత్ బర్ఫుకాన్ రక్త సంబంధాల కంటే జాతీయ ప్రయోజనాలను ముఖ్యమని భావించారని కొనియాడారు. తన దగ్గరి బంధువును శిక్షించడానికి కూడా వెనుకాడలేదని కూడా మోడీ గుర్తు చేసుకున్నారు. లచిత్ బర్ఫుకాన్ జీవితం రాజవంశం కంటే పైకి ఎదగడానికి, దేశం గురించి ఆలోచించడానికి భారతీయులందరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. దేశం కంటే పెద్ద బంధం ఏదీ లేదని ఆయన నిరూపించాడని అన్నారు.
కాగా.. బర్ఫుకాన్ అస్సాంలోని అహోమ్ రాజ్యంలోని రాజ సైన్యంలో ప్రసిద్ధ జనరల్ గా పని చేశారు. ఆయన 1622 నవంబర్ 24వ తేదీన జన్మించారు. మొఘల్లను ఓడించి, ఔరంగజేబు ఆధ్వర్యంలో విస్తరిస్తున్న వారి ఆశయాలను విజయవంతంగా నిలిపివేశారు. ఆయన 1672 ఏప్రిల్ 25న మరణించారు.