ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ దాడులకు భారత్ సమర్థంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్వర్ణ దేవాలయం లక్ష్యంగా పాక్ ప్లాన్‌ను ఆర్మీ ముందే అడ్డుకుంది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ మళ్లీ రెచ్చిపోయింది. భారత సైన్యం నిర్వహించిన ఈ మెరుపుదాడిలో ఉగ్ర స్థావరాలు ధ్వంసమవగా, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ పరిణామంతో పాకిస్థాన్ సైన్యం పలు దాడులకు యత్నించింది. పంజాబ్‌లోని ప్రముఖ మతపరమైన ప్రదేశం స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించేందుకు ప్రణాళికలు రెడీ చేసింది.

స్వర్ణ దేవాలయంపై దాడి..

పాకిస్థాన్ వైఖరిని ముందుగానే అంచనా వేసిన భారత రక్షణ వ్యవస్థ అప్రమత్తమైంది. ముఖ్యంగా మతపరమైన ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలకు అదనపు భద్రత కల్పించి, ఆ ప్రాంతాల్లో గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించింది. మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి వెల్లడించిన వివరాల ప్రకారం, పాక్ ఎటువంటి స్పష్టమైన లక్ష్యాలు లేకపోయినా స్వర్ణ దేవాలయంపై దాడి చేసే అవకాశాన్ని భారత ఆర్మీ ముందే గుర్తించింది. అందుకే అక్కడ ఎయిర్ డిఫెన్స్ గన్నర్లను వినియోగించి, పాక్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను సమర్థవంతంగా కూల్చేసింది.

పాక్‌ డ్రోన్లు, మిస్సెళ్ల శకలాలు స్వర్ణ దేవాలయం పరిసరాల్లో పడి ఉండగా, వాటిని కూల్చిన వీడియోలను వెస్ట్రన్ కమాండ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది దేశవ్యాప్తంగా వైరల్ అయింది. పాక్ దాడిని పూర్తిగా విఫలంచేసిన భారత ఎస్-400, ఆకాశ్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలు మరోసారి తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి. 

భారత ఆర్మీ ముందస్తు ప్లానింగ్, సమర్థవంతమైన టెక్నాలజీ ఉపయోగం వల్లే స్వర్ణ దేవాలయం వంటి ప్రాధాన్యత కలిగిన ప్రదేశాన్ని కాపాడగలిగింది.