India Pakistan Border: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పహల్గామ్ దాడి , ఆపరేషన్ సింధూర్ తర్వాత గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్‌లలో భారీ ఎత్తున మరోసారి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది భారత్.

India Pakistan Border: భారత్–పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ భద్రతను పరిగణనలోకి తీసుకుంటూ కీలక చర్యలకు సిద్ధమైంది. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న రాష్ట్రాల్లో మే 29న సాయంత్రం ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఒకేసారి చేపట్టనున్నారు. సాధారణ ప్రజలను యుద్ధ సంబంధిత ఎమర్జెన్సీ పరిస్థితులకు సిద్ధంగా ఉంచడం, స్థానిక, ప్రాంతీయ పరిపాలనా వ్యవస్థల భద్రతా సిద్ధతలను పరీక్షించడం దీనివెనకున్న ప్రధాన ఉద్దేశం. ఆపరేషన్ సింధూర్ తర్వాత మరోసారి పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించడం గమనార్హం. 

రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లా కలెక్టర్ టీనా దాాబీ మాట్లాడుతూ, పాకిస్తాన్ సరిహద్దు జిల్లాల్లో గురువారం మాక్ డ్రిల్ నిర్వహిస్తామని తెలిపారు. జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే మే 7, 8 తేదీల్లో త్రివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్. 

ఏప్రిల్ 22 ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. నాలుగు రోజుల పాటు, భారత దళాలు పాక్ ఆక్రమిత ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరాలపై క్షిపణులు, డ్రోన్లు, ఫిరంగులతో దాడులు చేశాయి. మే 10 సాయంత్రం భారత్, పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి అంగీకరించాయి.

ఇప్పుడు భారత్ మరోసారి మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజల సంసిద్ధత, రక్షణ చర్యలను అంచనా వేస్తారు. యుద్ధ సమయ పరిస్థితులను అనుకరిస్తూ, సైరన్లు, బ్లాక్‌అవుట్‌లు, తరలింపు ప్రక్రియలు వంటివి నిర్వహిస్తారు. సరిహద్దు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మే 7న ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జాతీయ స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. 1971 తర్వాత మొదటిసారిగా జాతీయ స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 250 ప్రదేశాల్లో ఆపరేషన్ అభ్యాస్ నిర్వహించారు. ఆపరేషన్ అభ్యాస్‌లో సైరన్లు మోగించి, విద్యార్థులకు, ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో శిక్షణ ఇచ్చారు.

ఈ మాక్ డ్రిల్ లో భాగంగా ఈ కింది చర్యలను తప్పనిసరి చేసింది:

  • సైరన్ వ్యవస్థలను సక్రియం చేయడం
  • ముఖ్యమైన మౌలిక సదుపాయాలను దాచడం
  • పాఠశాల విద్యార్థులకు, ప్రజలకు స్వీయ రక్షణపై శిక్షణ ఇవ్వడం
  • తరలింపు, బ్లాక్‌అవుట్ ప్రక్రియలను పరీక్షించడం

ఈ సమయంలో ఉత్తర, వాయువ్య భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. పాకిస్తాన్‌తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు భద్రతా చర్యలు తీసుకున్నాయి. పంజాబ్‌లో సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పబ్లిక్ ఈవెంట్స్ రద్దు చేసి, పాఠశాలలను మూసివేశారు. రాజస్థాన్‌లో కూడా సరిహద్దు ప్రాంతాల్లోని పాఠశాలలను మూసివేశారు.