భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ ను ప్రారంభించిన మోడీ-షేక్ హసీనా
New Delhi: భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ ను ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాలు కలిసి ప్రారంభించారు. రూ.377 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి సీమాంతర ఇంధన పైప్లైన్ ఇదే కాగా, ఇందులో బంగ్లాదేశ్ భాగాన్ని సుమారు రూ.285 కోట్ల వ్యయంతో నిర్మించారు.
![India - Bangladesh friendship pipeline was inaugurated by Narendra Modi and Sheikh Hasina. India - Bangladesh friendship pipeline was inaugurated by Narendra Modi and Sheikh Hasina.](https://static-ai.asianetnews.com/images/01dpdp6rrvq2x5k509rjjs2as9/modi-hasina-thumbnail-jpg_363x203xt.jpg)
ndia-Bangladesh Friendship Pipeline: భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ ను ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాలు కలిసి ప్రారంభించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల అధినేతలు కలిసి ప్రారంభించారు. ఈ పైప్ లైన్ బంగ్లాదేశ్ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందనీ, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న కనెక్టివిటీకి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని తాను విశ్వసిస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. రూ.377 కోట్ల అంచనా వ్యయంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య నిర్మించిన తొలి సీమాంతర ఇంధన పైప్లైన్ ఇదేనని, ఇందులో బంగ్లాదేశ్ భాగాన్ని సుమారు రూ.285 కోట్ల వ్యయంతో నిర్మించామని కేంద్ర పేర్కొంది. ఈ ఖర్చును భారత ప్రభుత్వం గ్రాంట్ అసిస్టెన్స్ కింద భరించిందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
"గత కొన్నేళ్లలో ప్రధాని షేక్ హసీనా సమర్థ నాయకత్వంలో బంగ్లాదేశ్ గణనీయమైన పురోగతి సాధించింది. ప్రతి భారతీయుడు దాని గురించి గర్వపడుతున్నాడు. బంగ్లాదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మేము దోహదపడగలిగినందుకు మేము సంతోషిస్తున్నాము" అని ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ అన్నారు. 2018 సెప్టెంబర్లో భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ ను పనులు ప్రారంభించామనీ, ఈ పైప్లైన్ సహాయంతో ఉత్తర పశ్చిమ బెంగాల్ జిల్లాలకు 1 మిలియన్ మెట్రిక్ టన్నుల హైస్పీడ్ డీజిల్ ను అందిస్తామని ప్రధాని మోడీ తెలిపారు. ఇది ఖర్చును తగ్గించడంతో పాటు సరఫరా సమయాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య కనెక్టివిటీ పురోగతిపై మోడీ మాట్లాడుతూ.. "1965 కు ముందు రైలు కనెక్టివిటీని పునరుద్ధరించాలనే తన విజన్ గురించి చాలా సంవత్సరాల క్రితం ప్రధాని షేక్ హసీనా మాట్లాడిన విషయం నాకు గుర్తుంది. అప్పటి నుంచి రెండు దేశాలు కలిసి ఎంతో పురోగతి సాధించాయి అని అన్నారు. రెండు దేశాల మధ్య ఈ రైలు కనెక్టివిటీ బంగ్లాదేశ్ కు కోవిడ్ వ్యాక్సిన్లను పంపడానికి సహాయపడిందనే విషయాన్ని పేర్కొన్నారు. రైల్వే నెట్ వర్క్ విషయంలో ప్రధాని షేక్ హసీనా దూరదృష్టిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. కాగా, బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జయంతి మరుసటి రోజే భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్ షిప్ పైప్ లైన్ ప్రారంభోత్సవం జరగడం గమనార్హం.
బెంగాలీలో మాట్లాడిన షేక్ హసీనా బంగ్లాదేశ్ లో ఇంధన భద్రతకు పైప్ లైన్ కీలకమని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అనేక దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, మన ప్రజలకు ఇంధన భద్రతను నిర్ధారించడంలో ఈ పైప్లైన్ గణనీయమైన పాత్ర పోషిస్తుందని ఆమె అన్నారు. బంగ్లాదేశ్ లో అస్సాంకు మంచి మార్కెట్ ఏర్పడిందన్నారు. అస్సాం వాసులకు మేలు జరుగుతున్నదని తెలిపారు.