మహాత్మా గాంధీ, నెహ్రూలను గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ.. వచ్చే 25 ఏళ్లు కీలకమంటూ వ్యాఖ్య
Independence Day 2022: భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. యావత్ భారతావని దేశభక్తి స్ఫూర్తితో నిండిపోయింది. ఈ క్రమంలోనే స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ.. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను గుర్తు చేసుకున్నారు.
Independence Day-PM Modi: ఆంగ్లేయుల నుంచి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పొందిన రోజును గుర్తుచేసుకుంటూ.. నేడు యావత్ భారతావని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. యావత్ భారతావని దేశభక్తి స్ఫూర్తితో నిండిపోయింది. ఈ క్రమంలోనే భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగంలో.. దేశం ఒక మైలురాయి నుండి మరో మైలురాయి ప్రయాణంలో ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. దేశంలోని మహిళల శక్తిని, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన స్వాతంత్య్ర సమర యోధులు, అమరవీరులను స్మరించుకున్నారు.
సోమవారం నాడు ఏర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. స్వాతంత్య్రం పొందిన తర్వాత జన్మించిన మొదటి ప్రధానమంత్రి తానేనని నొక్కి చెబుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను గుర్తు చేసుకున్నారు. "చివరి వ్యక్తి కోసం శ్రద్ధ వహించాలనే గాంధీ కల... చివరి వ్యక్తిని సైతం సమర్థుడిని చేయాలనే అతని ఆకాంక్ష.. నేను దాని కోసం నన్ను అంకితం చేసుకున్నాను" అని ప్రధాని మోడీ అన్నారు. జై కిసాన్, జై జవాన్, జై అనుసంధాన్, జై విజ్ఞాన్ (రైతులు, యువత, ఆవిష్కరణలు, విజ్ఞాన శాస్త్రం) నినాదాన్ని లేవనెత్తిన ప్రధాని మోడీ.. “75 ఏళ్లలో సాధించిన అన్ని విజయాలను చూసి మనం సంతృప్తి చెందలేము. వచ్చే 25 ఏళ్లు భారతదేశానికి చాలా కీలకం. యావత్ ప్రపంచం భారతదేశాన్ని చూసే విధానం మారుతోంది" అని అన్నారు.
భారతదేశ అభివృద్ధికి ఐదు వాగ్దానాలను కూడా ప్రధాని ప్రకటించారు . "అభివృద్ధి కోసం ఐదు వాగ్దానాలు (పంచప్రాన్)" అని ప్రధాని మోడీ ప్రకటించారు. మొదటి వాగ్దానం "అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యం.. పెద్ద ఆకాంక్షల దిశగా ముందుకు సాగడం. "రెండవది బానిసత్వం-వలసవాద మనస్తత్వ జాడను తొలగించడం. మూడవది మన వారసత్వం గురించి గర్వంగా ఉంటామనీ, నాల్గవది 130 కోట్ల భారతీయుల మధ్య ఐక్యత, ఐదవ వాగ్దానం పౌరుల కర్తవ్యాలను నేరవేరుస్తామని ప్రతిజ్ఞలు చేయాలని" ప్రధాని మోడీ కోరారు. 2047లో 50 ఏళ్లు నిండిన యువత భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రమాణం చేయాలని ప్రధాని మోడీ కోరారు. “మేము ప్రమాణం చేసినప్పుడు, మేము దానిని నెరవేరుస్తాము. అందుకే నా తొలి ప్రసంగంలో స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడినప్పుడు ఉద్యమం వచ్చింది’’ అని చెప్పారు.
దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగానికి ముందు ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు. రెండు MI-17 1V హెలికాప్టర్ల ద్వారా అమృత్ ఫార్మేషన్లోని వేదిక వద్ద పూలవర్షం కురిపించారు. ఎయిర్ ఫోర్స్ బ్యాండ్ జాతీయ జెండాను ఎగురవేస్తూ జాతీయ గీతాన్ని ప్లే చేసి 'రాశ్రిత్య వందనం' సమర్పించారు. సోమవారం ఎర్రకోటకు దాదాపు 250 మంది ప్రముఖులతో పాటు దాదాపు 8,000-10,000 మంది ప్రజలు హాజరయ్యారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలను పురస్కరించుకుని గత 75 వారాలుగా అనేక కార్యక్రమాలు జరిగాయి. కాగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 'హర్ ఘర్ తిరంగ' ప్రచారంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.