Independence Day 2022: లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలి.. మహిళలపై వేధింపులు అరికట్టాలి: ప్రధాని మోడీ
PM Narendra Modi: భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. అందరికీ సమానత్వాన్ని సాధించడానికి దేశం “లింగ సమానత్వాన్ని” ప్రోత్సహించాలని అన్నారు. వేధింపుల నుంచి మహిళలను బయటపడేసేందుకు ప్రతిజ్ఞ చేయాలన్నారు.
Gender equality: యావత్ భారతావని నేడు 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. అందరికీ సమానత్వాన్ని సాధించడానికి దేశం “లింగ సమానత్వాన్ని” ప్రోత్సహించాలని అన్నారు. వేధింపుల నుంచి మహిళలను బయటపడేసేందుకు ప్రతిజ్ఞ చేయాలన్నారు. కుమారుడు, కుమార్తె మధ్య భేదం చూపించొద్దని పేర్కొన్నారు. వేధింపుల నుంచి మహిళలు బయటపడేసేలా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. లింగ సమానత్వం ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ప్రధాని మోడీ.. మహిళల అణచివేత సంకెళ్ల నుండి భారతదేశం విడిపోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
భారతదేశం 76 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ తన ప్రసంగంలో, సమానత్వాన్ని సాధించడానికి దేశం లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలని అన్నారు. "ఈ ఐక్యతను నిర్ధారించడానికి మేము లింగ సమానత్వాన్ని నిర్ధారించాలి... కుమార్తెలు-కొడుకులను సమానంగా చూడకపోతే, ఈ ఐక్యత ఉండదు" అని మోడీ అన్నారు. భారతదేశంలో మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ప్రధాన మంత్రి.. "మహిళలను అగౌరవపరచడం" ఆపడానికి భారతదేశం ప్రతిజ్ఞ తీసుకోవాలని అన్నారు. మహిళల గురించి మాట్లాడటం, మహిళల గౌరవాన్ని తగ్గించే ఏదీ చేయకపోవడం ముఖ్యమని అన్నారు. దేశ కలలను నెరవేర్చడానికి “మహిళల గౌరవం” చాలా ముఖ్యమని ప్రధాని మోడీ నొక్కి చెప్పారు. నారీ శక్తిని కొనియాడిన ప్రధాని మోడీ.. క్రీడలు , కోర్టులు, మిలిటరీతో సహా వివిధ రంగాలలో మహిళలు ముందంజలో ఉన్నారని అన్నారు.
‘‘రాబోయే 25 ఏళ్లలో దేశంలోని మహిళలు వివిధ రంగాల్లో పెద్దఎత్తున సహకారం అందించడాన్ని నేను చూస్తున్నాను. మహిళల మరింత సాధికారత కోసం ప్రయత్నాలు చేయాలని ప్రతి ఒక్కరినీ నేను కోరుతున్నాను” అని మోడీ అన్నారు. ఈ సందర్భంగా బ్రిటిష్ వారి నుంచి భారత జాతి విముక్తి కోసం జరిగిన పోరాటంలో మహిళా స్వాతంత్య్ర సమరయోధుల సహకారాన్ని కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. రాణి లక్ష్మీబాయి, ఝల్కారీ బాయి, చెన్నమ్మ, బేగం హజ్రత్ మహల్ వంటి భారత మహిళల శక్తిని గుర్తుచేసుకున్నప్పుడు ప్రతి భారతీయుడు గర్వంతో నిండిపోతాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ నూతన జాతీయ విద్యా విధానం (NEP) 2020 గురించి కూడా ప్రస్తావించారు. ఇది భారతీయ విలువలలో పాతుకుపోయిందని అన్నారు. అన్ని రంగాల్లోని వాటాదారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని పాలసీని సిద్ధం చేశామన్నారు. NEP 2020 ద్వారా సూచించబడిన భారతీయ భాషల ప్రచారంపై కూడా ప్రధాని మాట్లాడారు.
“కొన్నిసార్లు మన ప్రతిభ భాషా అడ్డంకులచే పరిమితం చేయబడింది.. ఇది సామ్రాజ్యవాదానికి ఉదాహరణ. మన దేశంలోని ప్రతి భాష గురించి గర్వపడాలి' అని అన్నారు. భారతదేశ వైవిధ్యాన్ని కొనియాడారు. మన ప్రతిభను భాషా అవరోధాలు పరిమితం చేసినప్పటికీ, దేశంలో ఉన్న వివిధ భాషల పట్ల గర్వపడాలని అన్నారు. భారతదేశ బలాలు భిన్నత్వం.. ప్రజాస్వామ్యం అని అన్నారు. "భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి, వైవిధ్యం దాని బలం" అని ప్రధాని స్పష్టం చేశారు. మన వైవిధ్యం నుండి మనకు స్వాభావిక బలం ఉందని మన దేశం నిరూపించిందని తెలిపారు.