టార్గెట్ 2024: నేనేమీ జ్యోతిష్యురాలిని కాను.. విపక్ష కూటమి నాయకత్వంపై మమత ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టే విపక్ష కూటమికి మీరు నాయకత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు బెంగాల్ సీఎం మమత ఆసక్తికర సమాధానం చెప్పారు. తనకు జ్యోతిష్యం తెలియదని , ఎవరు నాయకత్వం వహించాలన్న దానిపై పరిస్ధితిని బట్టి నిర్ణయం వుంటుందని మమత స్పష్టం చేశారు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ కలిశారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో భేటీ అయ్యారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని భావిస్తున్న దీదీ ఆయా పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. ఈ భేటీ అనంతరం ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను కలవనున్నారు మమత. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు జట్టు కట్టాలని పిలుపునిచ్చారు.
విపక్ష కూటమికి మీరు నాయకత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు దీదీ ఆసక్తికర సమాధానం చెప్పారు. తనకు జ్యోతిష్యం తెలియదని , ఎవరు నాయకత్వం వహించాలన్న దానిపై పరిస్ధితిని బట్టి నిర్ణయం వుంటుందని మమత స్పష్టం చేశారు. ఒకవేళ ఎన్నికలు వస్తే అది మోడీకి దేశానికి మధ్య జరుగుతుందని మమత తెలిపారు. విపక్ష పార్టీలు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. కరోనా కారణంగా దేశంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు మమత. ఎంతమంది చనిపోయారా కూడా లెక్కలు లేవని చెప్పారు. కొన్ని శవాలను దహనం చేయకుండా గంగా నదిలో పడేశారని గుర్తుచేశారు.
Also Read:ఢిల్లీలో ఊహించని పరిణామం: రేపు సోనియాతో భేటీకి షెడ్యూల్.. అంతలోనే మోడీతో మమతా బెనర్జీ సమావేశం
సెకండ్ వేవ్లో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు ఈ దారుణాలను మరిచిపోరని చెప్పారు దీదీ. ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన మమతా బెనర్జీ నిన్న ప్రధాని మోడీని కలిశారు. రాష్ట్రంలో సమస్యలపై ప్రధానికి వివరించారు. అయితే తర్వాతి రోజు నుంచే ఆమె విపక్షనేతలతో వరుస భేటీలు రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి. పశ్చిమ బెంగాల్లో విక్టరీ తర్వాత దీదీ ఢిల్లీపై ఫోకస్ పెట్టారు.