టీచర్లు, విద్యార్థినుల చిత్రాలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు.. ఐఐటీ స్టూడెంట్ సైబర్ నేరాలు
ఐఐటీ స్టూడెంట్ తన టెక్ తెలివిని ఉపయోగించి మైనర్ గర్ల్స్ ఫొటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ముందు ఓ స్కూల్ బాలికతో పరిచయం పెంచుకుని ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో చేరి ఈ దారుణాలకు పాల్పడ్డాడు. కనీసం 50 మంది టీచర్లు, విద్యార్థినులను వేధించాడు.
న్యూఢిల్లీ: ఓ ఐఐటీ స్టూడెంట్ తన టెక్ తెలివిని టీచర్లను, విద్యార్థినులను వేధించడానికి వాడుకున్నాడు. తన గుర్తింపును భద్రంగా దాచిపెట్టి సైబర్ నేరాలు చేశాడు. యాప్లను ఉపయోగించి ఫేక్ కాలర్ ఐడీలతో ఫోన్లు చేశాడు. వర్చువల్ నెంబర్లతోనే వాట్సాప్లో బాధితులను కాంటాక్ట్ అయ్యాడు. తన గుర్తింపును దాచిపెట్టడానికి వాయిస్ మార్చే అప్లికేషన్లనూ ఉపయోగించాడు. బాధితుల పేరిట సోషల్ మీడియాలో నకిలీ మెయిల్ ఐడీలతో అకౌంట్లు ఓపెన్ చేశాడు. అందులో వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్టు చేస్తూ వేధించాడు. బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ దుండగుడు సుమారు 50 మంది విద్యార్థులు, టీచర్లను హరాస్ చేశాడు. ఢిల్లీలోని ఓ పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
తొలుత ఓ యువతితో స్నేహం చేసిన ఆ దుండగుడు సోషల్ మీడియాలో ఆమెతో కాంటాక్ట్లోకి వచ్చాడు. తర్వాత ఆమె స్నేహితులు, ఇతర పరిచయస్తులనూ కనుగొన్నాడు. తర్వాత వారి వివరాలు తీసుకుని వారికి వారి నెంబర్లే కనిపించే ఫేక్ నెంబర్లతో కాల్ చేస్తుండేవాడు. చాలా మంది మైనర్ గర్ల్స్ ఫొటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేశాడు. స్కూల్ పిల్లలు గ్రూపుల్లోకి లింక్ల ద్వారా చేరాడు. ఆన్లైన్ క్లాస్ల లింక్లను క్లిక్ చేసి అందులోకి ప్రవేశించాడు. ఇలా ఒకరి నుంచి ఇంకొకరి వివరాలను సేకరించి వేధింపులకు పాల్పడ్డాడు.
ఈ సైబర్ నేరాలపై దాఖలైన ఫిర్యాదుతో పోలీసులు ఐటీ వింగ్ సహాయంతో రంగంలోకి దిగింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేక్ మెయిల్ ఐడీల ఐపీ లాగ్ల వివరాలను విశ్లేషించారు. నిందితుడిని మహవీర్గా గుర్తించారు. నిందితుడు బిహార్ పాట్నాకు చెందినవాడిగా పేర్కొన్నారు. ఆ నిందితుడిని ట్రేస్ చేసి అరెస్టు చేశారు. అతడి నుంచి ఫోన్, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. అందులోనూ అసభ్యకరమైన వీడియోలు, చిత్రాలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.