సారాంశం

దేశంలోని అన్ని ప్రతిపక్షాలు కలిసినా వారి కంటే మోడీ ఒక్కడే శక్తిమంతుడైనప్పుడు ఇప్పుడు ఎన్డీయే ప్రత్యేకంగా బలం చూపెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? తమ సమావేశాలతో వారికి వణుకు పుట్టింది. అందుకే మిత్రపక్షాలు గుర్తుకు వచ్చాయని ఎన్డీయే భేటీ పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఎన్డీయే కూటమి భేటీ కావడంపై విమర్శలు సంధించారు. మొత్తం ప్రతిపక్షాలపైనా మోడీ ఒక్కడే శక్తిమంతుడు అని చెబుతారు కదా? మరి అలా ఆయన ఒక్కడే తమ అందరి కన్నా శక్తిమంతుడైనప్పుడు ఇప్పుడు కొత్తగా ఎన్డీయే కూటమి పార్టీలు ఎందుకు గుర్తుకు వచ్చాయని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు 30 పార్టీలను ఎందుకు ఒక్కదగ్గరికి చేరుస్తున్నారని అడిగారు. 

రేపు ఎన్డీయే పార్టీలు సమావేశం కాబోతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల ముంగిట్లో అమలు చేయాల్సిన వ్యూహాలు, సీట్ల సర్దుబాట్లు, సంఖ్యాబలం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ భేటీలో సుమారు 30 పార్టీలు సమావేశం కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే విమర్శలు చేశారు.

విపక్ష పార్టీలు ఏకం అవుతుండటం చూసి వారికి వణుకు పుట్టందని ఖర్గే అన్నారు. అందుకే వారికి వారి మిత్రపక్షాలు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు. వాటిని పిలిచి మీటింగ్ పెట్టాలనే ఆలోచన అనివార్యంగానే వచ్చిందని వివరించారు. అసలు ఆ పార్టీల పేర్లు ఏమిటో ప్రకటించాలని అన్నారు. అసలు ఆ పార్టీలు కనీసం ఎన్నికల సంఘం దగ్గర నమోదు చేసుకున్నాయా? లేదా అని అడిగారు. ఏదో మంది బలం చూపెట్టుకోవడానికే ఈ మీటింగ్ పెడుతున్నారా? అని ప్రశ్నించారు.

Also Read: బెంగళూరులో విపక్షాల భేటీకి శరద్ పవార్ హాజరు కావడం లేదా?.. క్లారిటీ ఇదే..!!

తమ కూటమిలోని పార్టీలు అలా కాదని ఖర్గే స్పష్టం చేశారు. తాము చాలా కాలం నుంచి కలిసే ఉంటున్నామని వివరించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు, పార్లమెంటులోపల, వెలుపల తామంతా కలిసే ఉంటామని, చాలా సార్లు ఉమ్మడి కార్యచరణ చేపట్టామని చెప్పారు. తామంతా ఒక చోట చేరడంతో ఎన్డీయేలో భయం మొదలైందని అన్నారు. అందుకే వారు తమ బలాన్ని చూపెట్టుకోవాలనే ఆలోచనలో పడ్డారని తెలిపారు.

ఈ రోజు బెంగళూరులో విపక్ష పార్టీల ప్రతినిధుల సమావేశం కాబోతున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల్లో రెండు సెషన్లు జరగనున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బెంగళూరుకు విచ్చేశారు. మరికొందరు బయల్దేరారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ సమావేశాల నిర్వహణ సన్నాహక బాధ్యతలు తీసుకున్నారు.