వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా  ఎదుర్కొవడమే లక్ష్యంగా పలు విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు పాట్నాలో సమావేశం కాగా.. రెండో సమావేశానికి బెంగళూరు వేదికగా నిలవనుంది.

ముంబై: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా  ఎదుర్కొవడమే లక్ష్యంగా పలు విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు పాట్నాలో సమావేశం కాగా.. రెండో సమావేశానికి బెంగళూరు వేదికగా నిలవనుంది. జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో విపక్షాల సమావేశం జరగనుంది. అయితే విపక్షాల భేటీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దూరం కానున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఆదివారం రోజున శరద్‌ పవార్‌ను తిరుగుబాటు నేత అజిత్ పవార్ వర్గం కలిసిన నేపథ్యంలో వెలువడిన ఈ ఊహాగానాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

అయితే తాజాగా ఈ విషయంపై ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గం క్లారిటీ ఇచ్చింది.  శరద్ పవార్ సోమవారం బెంగళూరులో జరగనున్న ఉమ్మడి ప్రతిపక్షాల మొదటి రోజు సమావేశానికి దూరంగా ఉంటారని ఆ పార్టీ తెలిపింది. మంగళవారం జరిగే 2వ రోజు సమావేశానికి శరద్ పవార్ హాజరవుతారని పేర్కొంది. ఈ మేరకు ఎన్‌సీపీ శరద్ వర్గం అధికార ప్రతినిధి మహేష్ భరెత్ తపసే ట్విట్టర్‌లో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించారు. శరద్ కుమార్తె సుప్రియా సూలే కూడా మంగళవారం రోజున విపక్షాల సమావేశానికి హాజరుకానున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘‘జూలై 18 మంగళవారం బెంగళూరులో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సుప్రియా  సూలే హాజరవుతారు’’ అని తపసే ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. శివసేన (ఉద్దవ్ వర్గం) నేత సంజయ్ రౌత్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. 

‘‘పాట్నా సమావేశం తర్వాత నేడు జరగనున్న బెంగళూరు సమావేశం నిర్ణయాత్మకం కానుంది. శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఈ సమావేశానికి హాజరుకానున్నారు. శరద్ పవార్ సమావేశానికి హాజరవుతారా లేదా అనే దానిపై గందరగోళం నెలకొంది. రేపు ఉదయం బెంగళూరులో జరిగే సమావేశానికి పవార్ హాజరుకానున్నారు. నేను కచ్చితంగా చెబుతున్నాను. హమ్ సబ్ ఏక్ హై!’’ అని సంజయ్ రౌత్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

ఇక, బెంగళూరులో జరిగే విపక్షాల సమావేశానికి కనీసం 26 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు హాజరవుతారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి ప్రతిపక్షాల సమావేశానికి ముందు బెంగళూరులోని రేస్‌కోర్స్‌ రోడ్డులో వివిధ పార్టీల నేతల పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి.

సోమవారం మధ్యాహ్నం జరిగే సమావేశానికి విపక్ష నేతలు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు అనధికారిక సమావేశం ఏర్పాటు చేయబడింది.  ఆ తర్వాత రాత్రి 8 గంటలకు విందు ఉంటుంది. మంగళవారం 2వ రోజున సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ప్రతిపక్ష పార్టీల నేతలు విలేకరుల సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. 

ఇక, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జూన్ 23న పాట్నాలో తొలి ప్రతిపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శరద్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సహా ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు.