ఐసీఐసీఐ బ్యాంకు టాప్ మేనేజ్మెంట్ లో మార్పులు, కొత్త సీఈఓగా సందీప్ భక్షి?
ఐసీఐసీఐ బ్యాాంకు టాప్ మేనేజ్ మెంట్ లో మార్పులు
న్యూఢిల్లీ:ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు సోమవారం నాడు సమావేశం కానుంది. ఈ సమావేశంలో బ్యాంకు కొత్త సీఈఓగా సందీప్ భక్షిని నియమించే అవకాశం ఉందని సమాచారం.ఐసీఐసీఐ బ్యాంకు టాప్ మేనేజ్మెంట్ లో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకు సీఈఓగా ఉన్న చందా కొచ్చర్ పై ఆరోపణలు వచ్చాయి.
వీడియోకాన్ కంపెనీకి రుణాల విషయంలో ఆమె భర్తపై ఆరోపణలు వచ్చాయి. తొలుత ఈ విషయమై ఐసీఐసీఐ బ్యాంకు మేనేజ్ మెంట్ చందాకొచ్చర్ కు మద్దతుగా నిలిచింది. సీబీఐ కేసు నమోదుతో పాటు ఈ కేసులో చోటు చేసుకొన్న పరిణామాలతో టాప్ మేనేజ్ మెంట్ లో మార్పులు చేర్పులు చేయాలని బ్యాంకు యాజమాన్యం భావిస్తోంది.
ఇందులో భాగంగానే సోమవారం నాడు బ్యాంకు మేనేజ్ మెంట్ అత్యవసరంగా సమావేశం కానుంది.ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదు.
ప్రస్తుతం సీఈఓగా ఉన్న చందా కొచ్చర్ లాంగ్ లీవ్ పెట్టే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. చందా కొచ్చర్ వైదొలిగితే ఆమె స్థానంలో సందీప్ భక్షిని ఆ స్థానంలో నియమించే అవకాశాలు లేకపోలేదని బ్యాంకు వర్గాల్లో ప్రచారంలో ఉంది.
బ్యాంకు నియమ నిబంధనలను సీఈఓగా ఉన్న చందా కొచ్చర్ ఉల్లంఘించారా లేదా అనే అంశాలపై విచారణ జరిపేందుకు గాను బ్యాంకు అంతర్గత విచారణ నిర్వహిస్తోంది. ఈ విచారణ కొనసాగే వరకు కొచ్చర్ లీవులో ఉండే అవకాశం ఉందని సమాచారం.