మాస్టర్ సర్జన్ కావాలనుకుంటున్నాను.. నీట్ టాపర్ ప్రభంజన్..
నీట్ టాపర్ ప్రభంజన్ నీట్ పరీక్ష తొలి ప్రయత్నంలోనే 720 మార్కులకు 720 సాధించి జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచాడు.
తమిళనాడు : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ ఫలితాలు బుధవారం వచ్చేశాయి. ఈ ఫలితాలలో నీట్ టాపర్ గా తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా మేల్మలయనూరుకు చెందిన ప్రభంజన్ నిలిచాడు. నీట్ పరీక్షలో మొదటి ప్రయత్నంలో 720 మార్కులకు 720 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచాడు ప్రభంజన్.
అతని తండ్రి జగదీష్ విల్లుపురం జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తల్లి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలే కావడం గమనార్హం. పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉందని ప్రభంజన్ చెప్పాడు.
NEET Results: నీట్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు విద్యార్థి .!
అమ్మ మాల, తండ్రి జగదీష్ ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని తెలిపాడు. డాక్టర్ కావాలని తాను చిన్నప్పటి నుంచి ఏమీ అనుకోలేదని అన్నాడు. కాకపోతే సైన్స్ పాఠాలు చాలా ఇష్టం అని అందుకే బాగా చదివానని తెలిపాడు. దీనివల్లే పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించగలిగానని చెప్పుకొచ్చాడు.
ప్రభంజన్ మాట్లాడుతూ.. ‘పుదుచ్చేరి జిప్మర్ కాలేజీ లేదా ఢిల్లీ ఎయిమ్స్ కాలేజీలో చదవాలనుకుంటున్నాను. మాస్టర్ సర్జన్గా పని చేయాలనుకుంటున్నాను. నీట్ చాలా మంచి పరీక్ష. ఈ పరీక్ష ఖచ్చితంగా అవసరమైనది. నీట్ కఠినం అనే ఆలోచన నుంచి బయటపడాలి. కఠోర శ్రమ, ఎక్కువ సాధన విజయాన్ని అందిస్తాయి’ అని చెప్పుకొచ్చాడు.
కాగా, ఈ నీట్ పరీక్షలో ఇద్దరు విద్యార్థులు తొలి ర్యాంక్ సాధించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బోరా వరుణ్ చక్రవర్తి అనే విద్యార్థి సత్తా చాటాడు. ఆలిండియా స్తాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. మరోవైపు తమిళనాడుకి చెందిన ప్రభంజన్ 99.99 పర్సంటైల్ సాధించి తొలి ర్యాంక్ పొందినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.