Election Ink: దేశ భవిషత్తుకు వేగు చుక్క. ఎన్నికల సిరా ఎక్కడ తయారవుతుందో తెలుసా ?
Election Ink: రెండు తెలుగు రాష్ట్రాలు ఓటింగ్ సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలో కేవలం లోక్ సభ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసే ముందు వేలికి వేసే సిరా మన రాష్ట్రంలోనే తయారవుతుందని ఎంత మందికి తెలుసు
![Hyderabad Based Company Rayudu Laboratories Manufactures Election Ink KRJ Hyderabad Based Company Rayudu Laboratories Manufactures Election Ink KRJ](https://static-ai.asianetnews.com/images/01hr95aycxrxk1gc034wxm5vpm/Indelible-Ink-photo-1709704575389_363x203xt.jpg)
Election Ink: మరి కొన్ని గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ జరగబోతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో జరుగుతున్న ఎన్నికలను పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఏడు విడతల్లో జరగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఇప్పుడు నాలుగో దశకు చేరుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణలో ఇది వరకే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయిన నేపథ్యంలో కేవలం పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
అయితే ప్రజాస్వామ్యంలో అందరూ సమానమైన అని చెప్పే ఏకైక సాధనం ఓటు హక్కు. బాధ్యతగల పౌరుడిగా మనంసమాజం గుర్తించాలంటే తప్పనిసరిగా ఆ శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి. అందుకే ఎన్నికల సమయంలో ఓటుకు అంత విలువ ఉంటుంది. కాగా.. ఎన్నికల్లో ఓటు వేసేందుకు బూత్ కు వెళ్లినప్పుడు అధికారులు ఓటరు చేతికి ఓ సిరా పూస్తారు. సామాన్యుడి నుంచి ప్రముఖుడి వరకు, సినిమా స్టార్ నుంచి రాజకీయ నాయకుడి వరకు ఎవ్వరైనా సరే ఓటు వేసిన సమయంలో ఈ సిరా కచ్చితంగా పూసుకోవాల్సిందే. అదే ఎన్నికల్లో రెండో సారి ఓటు వేయకుండా అడ్డుకట్ట వేసేందుకు దీనిని ఉపయోగిస్తారు.
ఎన్నికలు ముగిసినా.. చాలా రోజుల వరకు చేతికే ఉండిపోయే ఈ సిరాకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గతంలో ఈ సిరాను కేవలం ఎమ్ పీవీఎల్ (మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్) అనే కంపెనీ తయారు చేసేది. 1937లో అప్పటి మైసూర్ మహారాజు కృష్ణరాజ వడియార్ 4 ఈ కర్మగారాన్ని స్థాపించారు.1962 సార్వత్రిక ఎన్నికల నుంచి మైసూర్ పెయింటింగ్స్ అండ్ వార్నీష్ కర్మాగారం ఉత్పత్తి చేస్తున్న సిరానే వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలోని హైదరాబాద్ లో ఈ సిరాను తయారు చేస్తున్నారన్న సంగతి చాలా మందికి తెలియదు.
హైదరాబాద్ లో తయారవడమే కాదు..అది విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. ఈ కంపెనీ పేరు రాయుడు లేబరేటరీస్.. ఈ సంస్థలో పదుల సంఖ్యలోనే ఉద్యోగులు పని చేస్తున్నప్పటికీ.. అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించింది. ఈ సిరాను రాష్ట్రంలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఉపయోగించడంతోపాటు పిల్లలకు పోయే చుక్కలు వేసే సమయంలో గుర్తుపెట్టడానికి ఉపయోగిస్తున్నారు. దాదాపు 100కు పైగా ఆఫ్రికన్ దేశాలు ఎన్నికలకు ఈ సిరానే సరఫరా చేస్తున్నారు. ఈ ల్యాబ్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ డెవలప్మెంట్ యూనిసెఫ్ గుర్తింపు కూడా లభించింది.
ఈ సిరాల్లో ప్రత్యేకతలేంటి ?
సిరాలో 7 నుంచి 25% వరకు సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. అందుకే ఈ సిరా చేతికి వేసిన వెంటనే చెరిగిపోదు. ఇది నేరేడు రంగులో ఉంటుంది. ఓటు వేసే ముందు ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలు పై పోలింగ్ సిబ్బంది సిరాతో ఒక గీతను వేస్తారు. ఇదే ఓటు హక్కును వినియోగించుకున్న అనడానికి గుర్తు. ఓటర్ ఒక్కసారి ఓటును వినియోగించుకోవాలి. రెండోసారి ఓటు వేయకుండా ఈ చుక్క వేస్తారు. ఒకసారి వేలుపై సిరా గుర్తు వేస్తే దాదాపు 72 గంటల వరకు చెరిగిపోదు. అదే చర్మంపై పడితే 76 నుంచి 96 గంటల వరకు ఉంటుంది.