గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి, ఆ తరువాత గొంతు కోసి చంపేశాడో వ్యక్తి. బాధితురాలి తల్లికి చెందిన స్థలం విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఆగ్రా : ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి గర్భవతి అయిన తన భార్యను గొంతుకు ఉరేసి చంపి, ఆ తరువాత గొంతు కోసేశాడు. అతను చెప్పులు కుట్టే వ్యక్తి అని అతని పేరు ప్రవీణ్ అని సమాచారం. మృతురాలు ఐదు నెలల గర్భవతి. ఆమెను మొదట గొంతు బిగించి చంపి, ఆ తరువాత వంటగదిలో కత్తితో గొంతు కోసేశాడని పోలీసులు తెలిపారు.

నేరం చేసిన తర్వాత, నిందితుడు ప్రవీణ్ నగరంలోని షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడు మద్యం మత్తులో కనిపించడాని, దీంతో అతను చెప్పింది తాను నమ్మలేదని ఇన్‌స్పెక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. తరువాత, పోలీసుల బృందం అతని ఇంటికి వెళ్ళి చూడగా, అక్కడ అతని భార్య నైనా రక్తపు మడుగులో పడి ఉండడం గమనించారు.

పెళ్లికి ఒప్పుకోలేదని.. కాలేజీ విద్యార్థిని తలపై రాడ్‌తో కొట్టి హత్య...

బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. మృతురాలి తల్లి నిఖ్లేష్ దేవి మాట్లాడుతూ...తన కూతురు, ప్రవీణ్ ప్రేమ వివాహం చేసుకున్నారని తెలిపారు.

పెళ్లైన తరువాత ప్రవీణ్.. నైనా త‌ల్లి పేరుతో ఉన్న భూమిని తనకు కావాలని అడగడంతో వారిమధ్య గొడవలు మొదలయ్యాయి. నిఖ్లేష్ దేవి మాట్లాడుతూ, తన కుమార్తె, ప్రవీణ్ సుమారు రెండేళ్ల క్రితం కాలేజీలో పరిచయం అయ్యారు. ఆ తరువాత ప్రేమలో పడ్డారు, ఎనిమిది నెలల క్రితం వారి కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

వివాహం తర్వాత, ప్రవీణ్ నిఖ్లేష్ దేవి పేరుమీదున్న మూడు ప్లాట్లలో ఒకదానిని ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించాడు. ప్లాట్‌ని అతని పేరు మీదకు మార్చేందుకు నైనా నిరాకరించడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

గతంలో కూడా ప్రవీణ్ ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించగా ఆమె తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. అయితే, ఈసారి ఆమె తప్పించుకోలేకపోయిందని, ప్రాణాలు కోల్పోయిందని తల్లి చెబుతున్నారు. 

స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) షాహ్‌గంజ్, భాను ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. స్టేషన్ కు వచ్చి తనంతట తాను లొంగిపోయిన ప్రవీణ్ నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని జైలుకు పంపించేముందు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు.