Asianet News TeluguAsianet News Telugu

గుడికి వెళుతోందని... కట్టుకున్న భార్యను కొట్టిచంపిన కసాయి భర్త

 నిత్యం గుడులు గోపురాలకు వెళ్లివస్తోందని ఆగ్రహానికి గురయిన భర్త భార్యను కొట్టిచంపిన దుర్ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

husband kills wife in tamilnadu
Author
Chennai, First Published Oct 10, 2021, 10:46 AM IST

చెన్నై: అతి దైవభక్తితో నిత్యం గుడులు గోపురాలకు తిరుగుతూ ఇంటిని పట్టించుకోవడం లేదన్న కోపంతో కట్టుకున్న భార్యను అతి దారుణంగా కొట్టిచంపాడు ఓ కసాయి భర్త. ఈ దుర్ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... Tamilnadu రాజధాని చెన్నైలో నివాసముండే చంద్రమోహన్ కు సెల్వి తో 2011లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నాయి. అయితే సెల్వీకి దైవభక్తి చాలా ఎక్కువ. కుటుంబాన్ని, ఇంటిని కూడా పట్టించుకోకుండా నిత్యం గుడులు గోపురాలంటూ తిరుగుతూ వుండేది. ఈ విషయమై భార్యాభర్తలు మద్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. అయినప్పటికి సెల్వి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. 

read more  క్రైం కపుల్స్.. వినూత్న రీతిలో చోరీలు చేసిన ప్రేమికుల జంట.. ఇల్లు అద్దెకిస్తారా అంటూ స్కెచ్

ఈ క్రమంలోనే భర్త చంద్రమోహన్ వద్దని చెప్పినా గత గురువారం సెల్వ విళుపురంలోని ఓ ఆశ్రమానికి వెళ్లింది. ఓ రోజంతా ఆ ఆశ్రమంలోనే వుండి శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఆమె కోసం ఎదురుచూస్తూ ఇంట్లోనే వున్న భర్త తాను వద్దన్నా ఎందుకెళ్లావంటూ నిలదీసింది. దీంతో భార్యాభర్తల మద్య మరోసారి గొడవ చెలరేగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన భర్త కర్ర తీసుకుని భార్చపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన భార్యను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. 

భర్త చేతిలో దాడికి గురయిన సెల్వి  ఇంటి సమీపంలోని ఓ ఆలయంవద్దకు వెళ్లి స్పృహ కోల్పోయింది. రక్తపు మడుగులో పడివున్న ఆమెను గుర్తించిన స్థానికులు భర్త చంద్రమోహన్ కు సమాచారమిచ్చారు. దీంతో అతడు వెళ్లి భార్యను హాస్పిటల్ కు తరలించినా ఫలితంలేకుండా పోయింది. అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. 

మృతురాలి కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన ఆమె భర్తను అరెస్ట్ చేసారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి ప్రాణాలు కోల్పోవడం, తండ్రి జైలుపాలవడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు.


  

Follow Us:
Download App:
  • android
  • ios