భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఫ్రెండ్ హత్య.. భార్య స్టేట్మెంట్తో భర్తకు జీవిత ఖైదు
మహారాష్ట్రలో ఓ వ్యక్తి తన మిత్రుడితో కలిసి ఓ బిజినెస్ ప్రారంభించాడు. అందులో తన భార్య కూడా పని చేసింది. ఆ వ్యక్తి మరో పని చూసుకుని, ఆ బిజినెస్ను నడపాలని తన భార్య, మిత్రుడికి వదిలిపెట్టాడు. అయితే.. వారిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్న సంగతి తెలుసుకున్న ఆ వ్యక్తి ఆమె ముందే ఫ్రెండ్ను నరికి చంపేశాడు. ఇదే విషయాన్ని భార్య కోర్టులో చెప్పడంతో భర్తకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడింది.
ముంబయి: మహారాష్ట్రలో దంపతుల జీవితం విషాదంగా మారిపోయింది. భార్యతో తన ఫ్రెండ్ అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు ఆ భర్త తెలుసుకున్నాడు. పట్టరాని ఆగ్రహంతో భార్య ముందే తన ఫ్రెండ్ను నరికి చంపేశాడు. ఈ ఘటనపై కేసు ఫైల్ అయింది. కోర్టులో విచారణ జరిగింది. ఆ వ్యక్తి భార్య స్టేట్మెంట్ ఇచ్చింది. తన కళ్లముందే భర్త.. ఆ వ్యక్తిని చంపేసినట్టు ఆమె చెప్పింది. దీంతో నేరం నిరూపితమైందని కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి జీవిత ఖైదు శిక్ష విధించింది.
ఈ హత్య ఆరేళ్ల క్రితం జరిగింది. థానే జిల్లాకు చెందిన శివానంద్ శర్మ భారతి(52) భార్య బబిత. భారతి తన మిత్రుడు రవీంద్ర సాధు చవాన్ (45)తో కలిసి భీవండిలో బోర్డింగ్ ఫెసిలిటీ ప్రారంభించాడు. ఇందులో భారతి భార్య బబిత కూడా సహాయం చేయడం ప్రారంభించింది. కొన్నాళ్లకు భారతి వేరే జాబ్ చూసుకున్నాడు. ఆ బోర్డింగ్ ఫెసిలిటీని పూర్తిగా తన భార్య, తన మిత్రుడికే వదిలిపెట్టాడు. వారిద్దరే ఈ బోర్డింగ్ ఫెసిలిటీని నిర్వహించారు.
ఈ క్రమంలో బబిత, చవాన్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ అఫైర్ గురించి భారతికి తెలిసింది. 2017 మార్చిలో భారతి తన భార్య బబిత సమక్షంలోనే చవాన్ను గొడ్డలితో నరికి చంపేసినట్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ లాడ్వాంజరీ కోర్టుకు తెలిపారు.
Also Read: ఇంట్లో గొడవ.. భార్యను కారులో ఎక్కించుకుని నదిలోకి వేగంగా వెళ్లిన భర్త.. ఇద్దరూ దుర్మరణం
ఈ కేసును ప్రిన్సిపల్ జిల్లా జడ్జీ అభయ్ జే మంత్రి విచారిస్తున్నారు. బబిత సహా 15 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు.
తన కళ్ల ముందే భర్త.. ఆ వ్యక్తిని చంపేసినట్టు భార్య బబిత స్పష్టంగా చెప్పేసింది. దీంతో భారతిపై ఉన్న ఆరోపణలు ఎలాంటి సందేహం లేకుండా స్పష్టంగా నిరూపితమయ్యాయని న్యాయమూర్తి తెలిపారు. భారతిని దోషిగా తేల్చి యావజ్జీవ కఠిన కారాగార శిక్షను వేశారు. రూ. 15 వేల జరిమానాకూ విధించారు.