మటన్ వండిపెట్టలేదని భార్యను కిరాతకంగా హతమార్చిన భర్త
తలపై ఇనుప రాడ్డుతో కొట్టి...మూడో అంతస్తు నుండి తోసేసి...
కాలం మారుతున్న కొద్దీ మానవసంబంధాలకు విలువ లేకుండా పోతోంది. చిన్న చిన్న కారణఆలతో తమకు అత్యంత సన్నిహితులను కూడా హతమారుస్తున్నారు కొందరు కసాయిలు. అలా ఆదివారం రోజున మాంసం వండిపెట్టలేదని ఓ కిరాతక భర్త భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఫిరోజాబాద్ పట్టణంలోని పచ్వాన్ కాలనీలో మనోజ్ కుమార్, రాణి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి మనోజ్ మద్యం తాగి వచ్చి భార్యను నిత్యం వేధించేవాడు. అయితే అతడు ఎంత వేధించినా భార్య రాణి సహనంతో భరించేది. దీంతో అతడి ఆగడాలు సృతిమించిపోయాయి. నిన్న ఆదివారం భార్యకు మేక మాంసం వండమని చెప్పి మనోజ్ బైటికి వెళ్లాడు. అలా వెళ్ళిన అతడు ఫుల్లుగా మందు కొట్టి ఇంటికి వచ్చాడు. అయితే అప్పటికి భార్య మటన్ వండకపోవడంతో తీవ్ర ఆవేశానికి లోనైన మనోజ్ ఇనుపరాడ్డు తీసుకుని తలపై కొట్టాడు. ఈ దాడితో స్పృహ కోల్పోయిన భార్యను మూడో అంతస్తు నుండి కిందకు తోసేసి ఆత్మహత్యగా నమ్మించాలని చూశాడు.
అయితే రాణి తల్లిదండ్రులకు తమ కూతురి మరణానికి అత్తింటివారే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడు రమేష్ ను పట్టుకుని విచారించగా అసలు విషయాన్ని బైటపెట్టాడు. దీంతో పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించారు.