భర్త తన భార్యకు తెలియకుండా నగలు, ఇతర వ్యక్తిగత వస్తువులను తీసుకోకూడదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. భార్య నగల చోరీ కేసులో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

ఢిల్లీ : భార్య నగలను భర్త తీసుకోవడానికి వీలులేదని.. ఆమె అనుమతి లేకుండా తీసుకోవడం తప్పని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్య నగలను చోరీ చేసిన కేసులో భర్తకు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. భార్య నగలు ఆమె వ్యక్తిగత ఆస్తి అని.. భర్త అయినా సరే ముందుగా ఆమె అనుమతి లేకుండా తీసుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అమిత్ మహాజన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన సారథ్యంలోని డివిజన్ బెంచ్ ఉత్తర్వుల్లో మరికొన్ని అంశాలు పేర్కొంది. 

ఈ కేసులో కోర్టు సదరు భర్త కోపంతో తన భార్యను అత్తగారింటి నుంచి వెళ్లగొట్టొద్దని.. అపహరించిన నగలను తీసుకెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరిస్తూ ఈ కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని.. అంతేకాదు నిందితుడు కేసు విచారణకు అధికారులకు సహచరించడం లేదని.. చోరీకి గురైన నగలను తిరిగి ఇవ్వడం కానీ చేయలేదని తమ దృష్టికి వచ్చినట్లు న్యాయమూర్తి తెలిపారు.

భార్యతో గొడవపడి.. రెండు రోజుల పసికందును నేలకేసి కొట్టిన కసాయి తండ్రి..

కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఇలాంటివి ఎదురవుతున్న కారణంగా.. ఇలాంటి పరిస్థితుల్లో సదరు భర్తకు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని.. పిటిషన్ని రద్దు చేయలేమని అమిత్ మహాజన్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా నివారించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు.

ఇదిలా ఉండగా, తన భర్త గే అని.. తనతో కాపురం చేయడం లేదంటూ ఓ మహిళ ముంబై కోర్టును ఆశ్రయించింది. తన భర్త ప్రభుత్వ ఉద్యోగి అని తెలిపింది. అయితే అతను స్వలింగసంపర్కుడు అన్న విషయాన్ని దాచి పెట్టి తనను పెళ్ళి చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. అంతేకాదు పెళ్లయిన తర్వాత అతనికి దగ్గరయ్యేందుకు ఎంతగా ప్రయత్నం చేసినా కుదరలేదని తెలిపింది. అతనికి వేరే పురుషులతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని వాపోయింది.

తనను మోసపుచ్చి పెళ్లి చేసుకోవడమే కాకుండా.. ఆ తర్వాత తనకు తన దగ్గరకు రానివ్వ లేదని…దీంతోపాటు శారీరకంగా వేధించడం చేస్తున్నాడని పేర్కొంది. తన కుటుంబాన్ని, తనను, తమ ఆర్థిక పరిస్థితిని కించపరిచేలా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. వీటికి సంబంధించిన ఆధారాలను కూడా ఆమె ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించింది. ఈ మేరకు వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు ఊరట కలిగించింది. స్వలింగ సంపర్కుడన్న విషయాన్ని దాచిపెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నందుకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

దీంతోపాటు ఆమెకు ప్రతీనెలా 15 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆమెకు అనుకూలంగా మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే, ఈ తీర్పుపై భర్త ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేశాడు. ఈ కేసులోని సాక్ష్యాధారాలను న్యాయస్థానం పరిశీలించి కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని ఆమెకు అనుకూలంగానే సమర్ధించింది. అంతేకాదు కింది కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం లక్ష రూపాయలు, నెలనెలకు రూ.15వేలు తప్పనిసరిగా చెల్లించాలని స్పష్టం చేసింది.

వీరిద్దరికీ 2016లో పెద్దలు వివాహం జరిపించారు. అయితే పెళ్లి అయిన తర్వాత ఎన్ని రోజులు గడుస్తున్నా భర్త ఆమెను దగ్గరికి రానివ్వలేదు. ఆమెగా దగ్గరవ్వాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పైగా మాటలు, చేతలతో హింసించడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తన మీద రోజురోజుకు అనుమానం పెరిగిపోవడంతో నిఘా వేసింది. చివరికి అతను గే అని తెలుసుకుంది. అతడి ఫోన్ లో ఇతర పురుషులతో నగ్నంగా దిగిన ఫోటోలను చూసి షాక్ అయింది. వెంటనే కోర్టును ఆశ్రయించింది. ఆ ఫోటోలనే కోర్టులో సాక్ష్యంగా ఇచ్చింది.