కేరళలో మరో పరువు హత్య : యువకుడిని కిడ్నాప్ చేసి హతమార్చిన దుండగులు
ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకే హతమార్చారా?
కేరళ లోని కొట్టాయం లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని వారి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. భర్త హత్యలో తన సోదరుడి హస్తం ఉందని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ హత్యను పరువు హత్యగా పోలీసులు భావించి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కొట్టాయంలో ఎలక్ట్రీషన్ గా పనిచేసే కెవిన్ జోసెఫ్ (23) కొల్లాంకి చెందిన నీనూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అమితే వీరి కులాలు వేరు కావడంతో వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పారు. దీంతో వీరు ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.
అయితే వీరి వివాహం జరిగిన రోజు రాత్రి కొందరు దుండగులు ఆయుధాలతో ఈ దంపతులు వున్న ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో వస్తులను పగలగొడుతూ నానాహంగామా సృష్టించడంలతో పాటు కెవిన్ ను కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని కొల్లాంకు కొద్ది దూరంలోని చిలియెక్కర ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చారు.
ఈ హత్యకు తన సోదరుడే కారణమంటూ నీనూ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తన భర్త కిడ్నాప్ విషయాన్ని పోలీసులకు ముందే తెలియజేసినా వారు నిర్లక్ష్యం వహించారని బాధితురాలు ఆరోపించింది. కాగా ఈ ఘటనలో ఇప్పటికే కొట్టాయం జిల్లా ఎస్పీని బదిలీ చేయడంతో పాటు గాంధీనగర్ ఎస్సైపై విచారణ చేపట్టినట్టు సమాచారం.